WPL 2024, UP vs DC | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్లో యూపీ వారియర్స్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో టాపార్డర్ విఫలమవడంతో కీలక దశలో వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజేతులా పోగొట్టుకున్న ఆ జట్టు తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్తోనూ అదే బాటలో నడిచింది. బెంగళూరులో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో యూపీ.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టులో శ్వేతా సెహ్రావత్ (42 బంతుల్లో 45, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ఢిల్లీ బౌలర్లలో మరజన్నె కాప్ (3/5) పేస్తో నిప్పులు చెరగగా.. స్పిన్నర్ రాధా యాదవ్ సైతం మూడు (4/20) తో యూపీ వారియర్స్ను కట్టడి చేసింది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ మూడో ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ వృందా దినేశ్ డకౌట్ అయింది. మరిజన్నె కాప్ వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టింది. యూపీ సారథి అలిస్సా హీలి (13) మరోసారి నిరాశపరచగా ఆల్ రౌండర్ తహిలా మెక్గ్రాత్ (1) కూడా హీలి బాటనే పట్టింది. ఈ మూడు వికెట్లూ కాప్కే దక్కాయి.
BRB, watching this on loop! 🫶pic.twitter.com/POMyVtecz0
— Delhi Capitals (@DelhiCapitals) February 26, 2024
16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన యూపీని గ్రేస్ హరీస్ (17), శ్వేతా ఆదుకున్నారు. హరీస్తో కలిసి నాలుగో వికెట్కు 24 పరుగులు జోడించిన శ్వేతా.. సహచర ఆటగాళ్లు విఫలమవుతున్నా ఓపికగా బ్యాటింగ్ చేసింది. కిరణ్ నవగరె (10), పూనమ్ ఖేమ్నర్ (10), దీప్తి శర్మ (5)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. శ్వేతా కూడా ఆడకుంటే యూపీ మూడంకెల స్కోరు కూడా చేసేది కాదు. ఢిల్లీ బౌలర్లలో కాప్.. 4 ఓవర్లు వేసి ఒక్క మెయిడిన్ చేయడమే గాక ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసింది. రాధా యాదవ్.. 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అరుంధతి రెడ్డి, సదర్లాండ్లకు తలా ఒక వికెట్ దక్కింది.