WPL 2024, MI vs RCB | మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఎలిమినేటర్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తడబడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు.. టాపార్డర్ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులే చేయగలిగింది. ఆర్సీబీ ఆల్రౌండర్ ఎల్లీస్ పెర్రీ (50 బంతుల్లో 66, 8 ఫోర్లు, 1 సిక్సర్) మరోసారి జట్టును ఆదుకుంది. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్ (2/18), సీవర్ బ్రంట్ (2/18) లు ఆదిలోనే బెంగళూరును దెబ్బతీశారు. సైకా ఇషాక్ కూడా రెండు వికెట్లు తీసింది.
టాపార్డర్ టపటప..
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు వచ్చిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్ను దాటిగానే ఆరంభించింది. షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన తొలి ఓవర్లో మొదటి బంతికే స్మృతి మంధాన (10) ఒక ఫోర్ కొట్టగా డెవిన్ (10) రెండు బౌండరీలు సాధించింది. కానీ రెండో ఓవర్లో ఆర్సీబీకి తొలి షాక్ తాకింది. మాథ్యూస్ వేసిన రెండో ఓవర్లో డెవిన్ క్లీన్ బౌల్డ్ అయింది. మూడో ఓవర్లో నటాలీ సీవర్ బ్రంట్.. మంధానను ఔట్ చేసింది. సైకా ఇషాక్ వేసిన నాలుగో ఓవర్లో దిశా కసత్ డకౌట్ అయింది. రిచా ఘోష్ (19) కూడా విఫలమైంది. సోఫీ మొలినెక్స్ (11) ను సీవర్ బ్రంట్ పెవిలియన్కు పంపింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ.. 84 పరుగులే చేసి 5 వికెట్లు కోల్పోయింది.
ఆదుకున్న పెర్రీ..
క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్నా ఆర్సీబీని పెర్రీ ఆదుకుంది. రిచా ఘోష్తో కలిసి నాలుగో వికెట్కు 26 పరుగులు జోడించిన పెర్రీ.. మోలినెక్స్తో కలిసి 35 రన్స్ జతచేసింది. 16వ ఓవర్ వరకూ పరిస్థితులకు తగ్గట్టు ఆడిన పెర్రీ.. ఆ తర్వాత జోరు పెంచింది. ఇస్మాయిల్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో ఆమె అర్థ సెంచరీతో పాటు ఆర్సీబీ వంద పరుగులు పూర్తయ్యాయి. అమెలియా కెర్ వేసిన మరుసటి ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన ఆమె.. సైకా ఇషాక్ వేసిన చివరి ఓవర్లో భారీ షాట్ ఆడబోయి నిష్క్రమించింది. జార్జియా వర్హెమ్ (10 బంతుల్లో 18 నాటౌట్) ఆఖర్లో ఫోర్, సిక్సర్తో రాణించింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని (136) ముంబై ఏ మేరకు ఛేదిస్తుందనేది ఆసక్తికరం.