న్యూఢిల్లీ: జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) విధించిన తాత్కాలిక నిషేధాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్(యూడబ్ల్యూడబ్ల్యూ) మంగళవారం ఎత్తివేసింది. అయితే రెజ్లింగ్ అసోసియేషన్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేసిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాపై ఎలాంటి వివక్ష చూపించవద్దని యూడబ్ల్యూడబ్ల్యూ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని డబ్ల్యూఎఫ్ఐని ఆదేశించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా గతేడాది ఆగస్టు 23న డబ్ల్యూఎఫ్ఐపై యూడబ్ల్యూడబ్ల్యూ నిషేధం విధించింది. అయితే దీనిపై ఈనెల 9న సమావేశమైన యూడబ్ల్యూడబ్ల్యూ నిషేధంతో పాటు మిగతా అంశాలపై చర్చించింది. ఒలింపిక్స్, ఇతర డబ్ల్యూఎఫ్ఐ టోర్నీల్లో పాల్గొనే రెజ్లర్లకు ట్రయల్స్ నిర్వహించాలని వరల్డ్ బాడీ పేర్కొంది. రెజ్లింగ్ సంఘంపై పోరాడిన రెజ్లర్లు వినేశ్, సాక్షి, జజరంగ్పై ఎలాంటి వివక్ష ప్రదర్శించకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే బ్రిజ్భూషన్ శరణ్సింగ్ స్థానంలో అధ్యక్షుడిగా ఎన్నికైన సంజయ్సింగ్ నియామకాన్ని కేంద్ర క్రీడాశాఖ రద్దు చేస్తూ అడ్హాక్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే.