తాష్కెంట్: ప్రతిష్ఠాత్మక బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ శుభారంభం చేశాడు. సోమవారం మొదలైన మెగాటోర్నీలో హుసామ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. 57కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఈ తెలంగాణ యువ బాక్సర్ 5-0తో అలెన్ రుస్తోమ్వ్స్కీ(మాసిడోనియా)పై అలవోక విజయం సాధించాడు. తొలుత నెమ్మదిగానే బౌట్ను మొదలుపెట్టిన హుసామ్.. ఆ తర్వాత ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డాడు. తనదైన ఆధిపత్యం ప్రదర్శిస్తూ కచ్చితమైన పంచ్లకు తోడు జాబ్స్, హుక్స్తో చెలరేగాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా క్లీన్పంచ్లు విసిరిన హుసామ్ ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు 60కిలోల విభాగంలో వరిందర్సింగ్ 0-5తో ముజిబిలో తుర్సునోవ్(ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మంగళవారం జరిగే బౌట్లలో అశిష్ చౌదరీ, హర్ష్ చౌదరీ, అశిష్ బరిలోకి దిగనున్నారు. తాష్కెంట్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ తరఫున 13 మంది బాక్సర్లు బరిలో ఉన్నారు.