న్యూఢిల్లీ: శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ అంతర్జాతీయ మ్యాచుల్లో 73వ సెంచరీ నమోదు చేశాడు. ఆ వన్డేలో కోహ్లీ 113 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లీ ఆటతీరుపై మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా థ్రిల్ అయ్యాడు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో లారా తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశాడు.
నిజానికి వన్ డౌన్లో కోహ్లీ బ్యాటింగ్కు వచ్చాడు. అయితే ఈ మ్యాచ్లో ఓపెనర్లు రోహిత్, గిల్లు తొలి వికెట్కు 143 రన్స్ జోడించారు. ఆ సమయంలో కోహ్లీ డగౌట్లో కూర్చున్నాడు. డగౌట్లో కూర్చున్న కోహ్లీ ఫోటోను లారా తన ఇన్స్టా స్టోరీలో పోస్టు చేశాడు. బ్యాటింగ్ కోసం కోహ్లీ ఎలా ఎదురుచూస్తున్నాడో.. అలాగే తాను కూడా కోహ్లీ ఆటను చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు లారా ఆ ఫోటోపై కామెంట్ చేశారు. కోహ్లీ బ్యాటింగ్ పూర్తి అయ్యే వరకు ఎదురుచూస్తానని లారా అన్నారు.
ఇక చివరకు కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత సంతోషంలో తేలిపోయాడు. 45వ వన్డే సెంచరీని అతను సెలబ్రేట్ చేసుకున్నాడు. సెంచరీ చేసి బ్యాట్ ఎత్తిన కోహ్లీ ఫోటోను పోస్టు చేసి.. దానిపై కూడా లారా కామెంట్ చేశారు. ఇది మార్నింగ్ రన్ అంటూ విండీస్ దిగ్గజ బ్యాటర్ పేర్కొన్నారు.