IPL 2024 Auction: మరికొద్దిరోజుల్లో దుబాయ్ వేదికగా జరగాల్సి ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) – 2024 వేలం ప్రక్రియకు ముందే పది ఫ్రాంచైజీలూ ఏ ఆటగాడిని తీసుకోవాలి..? ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలి..? జట్టు కూర్పు కుదరాలంటే ఏ ప్లేయర్ను తీసుకుంటే బెటర్..? అని మల్లగుల్లాలు పడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్, ఐదుసార్లు ఐపీఎల్-16 ట్రోఫీ విజేత చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి రూ. 16.5 కోట్ల బెన్ స్టోక్స్తో పాటు రిటైర్డ్ ప్లేయర్ అంబటి రాయుడు స్థానాలను ఎవరితో భర్తీ చేయినుంది..? వీరి స్థానాలను భర్తీ చేసేందుకు చెన్నై ఎలాంటి వ్యూహాలను అమలుపరుచనుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ స్థానంలో ఆల్ రౌండర్ కోసం చూస్తున్న చెన్నై ఈసారి కివీస్ స్టార్ ఆల్ రౌండర్లు రచిన్ రవీంద్ర, డారెల్ మిచెల్ల కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయని చెప్పాడు. తన యూట్యూబ్ ఛానెల్లో చోప్రా మాట్లాడుతూ.. చెన్నైకి ఆల్ రౌండర్ కావాలి. బెన్ స్టోక్స్ స్థానాన్ని రచిన్ రవీంద్ర పూర్తి చేయగలడు. ఒకవేళ రవీంద్ర దక్కకుంటే డారెల్ మిచెల్ కూడా మంచి ఆప్షన్. చెన్నైకి స్పిన్నర్ల అవసరం లేదు. ఎందుకంటే ఆ జట్టులో ఇదివరకే రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, మహీశ్ తీక్షణ రూపంలో క్వాలిటీ స్పిన్నర్లున్నారు. రవీంద్ర కూడా స్పిన్ ఆల్ రౌండరే… అని చెప్పాడు.
ఇక రాయుడు స్థానంలో మనీష్ పాండే బెటర్ ఆప్షన్ అని చోప్రా అన్నాడు. రాయుడు స్థానంలో ఆ జట్టు మనీష్ పాండేను తీసుకుంటే కూర్పు కూడా కుదురుతుంది. ధోనీ ఉన్నా అతడు ఆఖర్లో వస్తాడు. అంతకంటే ముందే ఇన్నింగ్స్ను చక్కదిద్దే పని తీసుకునే బ్యాటర్ను తీసుకుంటే బెటర్. ఈ కోణంలో చూస్తే మనీష్ పాండే గానీ కరుణ్ నాయర్ గానీ చెన్నైకి ఉన్న మంచి ఆప్షన్స్.. అని తెలిపాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ రిటెన్షన్ ప్రక్రియలో చెన్నై స్టోక్స్, రాయుడుతో పాటు డ్వేన్ ప్రిటోరియస్, భగత్ వర్మ, సుదర్శన్ సేనాపతి, సిసంద మగల, కైల్ జెమీసన్, ఆకాశ్ సింగ్లను వదిలేసుకున్న విషయం విదితమే. ఆ జట్టు ఖాతాలో రూ. 32.2 కోట్లున్నాయి.