Maidaan Movie | బాలీవుడ్ అగ్రహీరో అజయ్ దేవ్గణ్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ ట్రైలర్ ఎట్టకేలకు విడుదల అయింది. భారత ఫుట్బాల్లో స్వర్ణయుగంగా భావించే 1950-1963 మధ్య కాలంలో మన జట్టుకు కోచ్గా వ్యవహరించిన సయిద్ అబ్దుల్ రహీమ్ జీవితంలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. 2020లోనే మొదలైన ఈ సినిమా పలు అవాంతరాలను అధిగమించి ఎట్టకేలకు ఈ రంజాన్కు విడుదలవనుంది. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్ ఫుట్బాల్ కోచ్ పాత్ర పోషించగా.. ఆ ఒరిజినల్ సయిద్ అబ్దుల్ రహీమ్ ఎవరు..? హైదరాబాద్తో ఆయనకు ఏంటి సంబంధం..? భారత ఫుట్బాల్ జట్టుకు ఆ దిగ్గజం అందించిన సేవలు ఏంటి..? వంటి ఆసక్తికర విషయాలు మీకోసం..
పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే..
గత శతాబ్దపు భారత ఫుట్బాల్ అభిమానులు ‘రహీమ్ సాబ్’గా పిలుచుకునే సయిద్ అబ్దుల్ రహీమ్ పుట్టిపెరిగిందంతా మన హైదరాబాద్ (అప్పటి బ్రిటీష్ ఇండియాలోని హైదరాబాద్ స్టేట్) లోనే. 1909లో జన్మించిన రహీమ్..ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆయనకు చిన్ననాటి నుంచే ఫుట్బాల్పై మక్కువ ఎక్కువ. కానీ చదువు అయ్యాక ఆయన స్కూల్ టీచర్గా పనిచేయాల్సి వచ్చింది. కాచిగూడ మిడిల్ స్కూల్, ఉర్దూ షరీఫ్ స్కూల్, దారుల్ ఉల్ ఉలూమ్ హై స్కూల్ తో పాటు చాదర్ఘాట్ హైస్కూల్లో కూడా ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత ఫిజికల్ ఎడ్యుకేషన్లో డిప్లొమో చేసి క్రీడోపాధ్యాయుడి దిశగా అడుగులు వేశారు.
మన ఉస్మానియా టీమ్ మెంబర్..
ఉస్మానియాలో ఉండగానే ఆయన యూనివర్సిటీ టీమ్కు ప్రాతినిథ్యం వహించారు. చదువు అయ్యాక కూడా ఉస్మానియా తరఫున ‘ఎలెవన్ హంటర్స్’ అనే టీమ్లో ఆడాడు. 1927 నుంచి 1931 దాకా ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఫుట్బాల్ ప్లేయర్.ఫుట్బాల్ను సీరియస్గా తీసుకున్న తర్వాత ఆయన సీనియర్ లెవల్లో స్థానికంగా ఉన్న ‘ఖామర్ క్లబ్’లో ఆడాడు. అంతేగాక నెదర్లాండ్స్లోని డచ్ అమెట్యూర్ లీగ్లో హెచ్ఎస్వీ హోయెక్ క్లబ్ తరఫున ఆడారు. 1950లో ఆయన ప్రొఫెషనల్ ఫుట్బాల్ కెరీర్ (ప్లేయర్గా)కు గుడ్ బై చెప్పారు.
హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కు కోచ్..
1950లో ప్లేయర్గా నిష్క్రమించినా కోచ్గా ఆయన కొత్త కెరీర్ మొదలుపెట్టారు. హైదరాబాద్ సిటీ పోలీస్ క్లబ్కు కోచ్గా ఎంపికవడం ఆయన ఫస్ట్ టాస్క్. ఆయన హయాంలో హైదరాబాద్లో ఫుట్బాల్ ఆట కొత్త పుంతలు తొక్కింది. హైదరాబాద్ క్లబ్.. 1950 నుంచి 1955 దాకా ఏకంగా ఐదు సార్లు రోవర్స్ కప్ నెగ్గింది. ఐదు సార్లు డ్యూరాండ్ కప్ ఫైనల్స్కు వెళ్లి అందులో మూడుసార్లు విజేతగా నిలిచింది.
Born #OnThisDay in 1909, Syed Abdul Rahim
✔️ Gold in 1951, 1962 Asian Games
✔️ 4th place in 1956 Olympics
✔️ Record 62% win rate with India NT
✔️ Dominance in club football with Hyderabad City Police
✔️ Tactical innovations
✔️ Greatest coach in #IndianFootball history pic.twitter.com/8qOaOGtiVS— IndianFootball_History (@IndianfootballH) August 17, 2019
భారత్కు స్వర్ణయుగం..
హైదరాబాద్ సిటీ క్లబ్ కోచ్గా ఉన్న ఆయన అదే ఏడాది భారత ఫుట్బాల్ జట్టుకు మేనేజర్గా నియమితుడయ్యారు. 1950 నుంచి ఆయన చనిపోయేదాకా (1963) ఈ పదవిలో కొనసాగారు. ఈ కాలాన్ని భారత ఫుట్బాల్లో స్వర్ణయుగంగా పిలుస్తారు. ఈ పదమూడేండ్లలో భారత ఫుట్బాల్ జట్టు అసమాన విజయాలతో దూసుకెళ్లింది. ఆయన హయాంలో భారత్.. 1951లో నిర్వహించిన తొలి ఆసియా గేమ్స్లో ఇరాన్ను 1-0తో ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది. అంతేగాక 1952, 1954లో కొలంబో కప్, 1959లో మెర్కెక కప్ గెలిచింది. 1962లో జకర్తాలో జరిగిన ఆసియా గేమ్స్లోనూ దక్షిణ కొరియాను ఫైనల్లో ఓడించి రెండో స్వర్ణం సాధించింది. 1956లో మెల్బోర్న్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో సెమీఫైనల్స్ దాకా వెళ్లింది. భారత ఫుట్బాల్ చరిత్రలో ఇప్పటివరకూ ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ప్రస్తుతం ఫిఫా ఫుట్బాల్లో క్వాలిఫికేషన్ ఆడేందుకు నానా తంటాలు పడుతున్న మన జట్టు.. 1958 ఫిఫా వరల్డ్ కప్ సెమీస్ వరకూ వెళ్లగలిగింది రహీమ్ హయాంలోనే కావడం గమనార్హం.
రహీమ్ హయాంలో భారత జట్టును ‘బ్రెజిల్ ఆఫ్ ఆసియా’ అని పిలిచేవారంటే మన ఆధిక్యం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఫుట్బాల్ కీర్తిని దశదిశలా వ్యాపించిన ఆయన సామర్థ్యాన్ని చూసి 1954లో ప్రముఖ బ్రిటీష్ ఫుట్బాల్ టీమ్ మేనేజర్ అయిన బెర్ట్ ఫ్లాట్లీ.. 1954 కొలంబో కప్లో రహీమ్కు అసిస్టెంట్గా వచ్చారు. ఇంతటి ఘనకీర్తిని కలిగిన సయిద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర నేటి యుగానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ మోజులో పడి ఫిఫా ప్రపంచకప్ వంటి భారీ టోర్నీలు ఆడితే తప్ప అసలు భారత్తో ఫుట్బాల్కు ఏం సంబంధం..? అనుకునే నేటి యువతరానికి మన దేశ ఫుట్బాల్ గొప్పతనాన్ని దశదిశలా వ్యాపింపజేసిన రహీమ్ సాబ్ గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం..