వరల్డ్ టూర్ ఫైనల్స్
బాలి (ఇండోనేషియా): ఈ ఏడాది ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. సీజన్ ముగింపు టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో దుమ్మురేపుతున్నది. వరుస విజయాలతో నాకౌట్కు అర్హత సాధించిన సింధు.. శనివారం జరిగిన సెమీఫైనల్లో 21-15, 15-21, 21-19తో ప్రపంచ మూడో ర్యాంకర్ అకానే యమగూచి (జపాన్)పై ఘనవిజయం సాధించింది. వరల్డ్ టూర్ ఫైనల్స్లో తుది పోరుకు చేరడం సింధుకు ఇది మూడోసారి కాగా.. ఈ టోర్నీలో విజేతగా నిలిచిన ఏకైక భారత ప్లేయర్ రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది. 2018 సీజన్లో సింధు వరల్డ్ టూర్ టైటిల్ కైవసం చేసుకుంది. ఇక పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో భారత యువ ఆటగాడు లక్ష్యసేన్ 13-21, 11-21తో ఒలింపిక్ చాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యాడు. టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం చేజిక్కించుకున్నాక.. ఆటకు మూడు నెలల బ్రేక్ ఇచ్చి తిరిగి మైదానంలో అడుగుపెట్టాక వరుసగా మూడు టోర్నీల్లోనూ ఫైనల్ చేరడంలో విఫలమైన సింధు.. శనివారం పోరులో విశ్వరూపం కనబర్చింది. గంటా 10 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా.. కీలక సమయాల్లో ఆధిక్యం కొనసాగిస్తూ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం జరుగనున్న టైటిల్ పోరులోప్రపంచ ఆరో ర్యాంకర్ అన్ సెయాంగ్ (కొరియా)తో సింధు తలపడనుంది.
నువ్వా.. నేనా..
ఈ ఏడాది ఆరంభంలో జరిగిన స్విస్ ఓపెన్లో మినహా ఒక్క టోర్నీలో కూడా ఫైనల్కు చేరని సింధు..శనివారం సెమీస్లో పూర్తి స్థాయిలో సత్తాచాటింది. తనకే సొంతమైన లాంగ్ ర్యాలీలకు తోడు క్రాస్ కోర్ట్ షాట్లతో విజృంభించింది. తొలి గేమ్ ఆరంభంలో 0-4తో వెనుకబడ్డ సింధు.. ఆ వెంటనే పుంజుకొని 4-4తో స్కోరు సమం చేసింది. అయితే కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన తెలుగమ్మాయి తొలి గేమ్ను ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఒక దశలో 10-10తో స్కోర్లు సమమైనా.. ఆ తర్వాత యమగూచి వరుస పాయింట్లతో విజృంభించి గేమ్ను సొంతం చేసుకుంది. ఇక మూడో గేమ్లో ఇరువురు ఆటగాళ్లు పోరాడగా.. 19-19తో స్కోర్లు సమమయ్యాయి. ఈ సమయంలో సింధు రెండు సూపర్ స్మాష్లతో గేమ్తో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది.