Hadik Pandya: గుజరాత్ టైటాన్స్ మాజీ సారథి హార్ధిక్ పాండ్యా తిరిగి తన మాతృ జట్టు ముంబై ఇండియన్స్కు రావడం ప్రస్తుతం క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశమైంది. గుజరాత్ టీమ్ను రెండుసార్లు విజయంతంగా నడిపించి మొదటి ప్రయత్నంలోనే కప్ నెగ్గిన సారథిగా రికార్డులు తిరగరాసిన హార్థిక్.. ఆ జట్టును ఎందుకు వీడాల్సి వచ్చిందనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. గుజరాత్ టీమ్ మేనేజ్మెంట్తో రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు వచ్చాయని ప్రచారం సాగుతున్నా దానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే పాండ్యా ట్రేడ్ ప్రక్రియ ముగిసిన తర్వాత టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా చేసిన ట్వీట్, తన యూట్యూబ్ వేదికగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పరోక్షంగా పాండ్యాను ఉద్దేశించే చోప్రా ట్వీట్ చేశాడని నెటిజన్లు చెవురు కొరుక్కుంటున్నారు.
హార్ధిక్ ట్రేడ్ ప్రక్రియపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఆకాశ్ చోప్రా స్పందిస్తూ.. `జీవితంలో డబ్బు, విలువలలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఒకసారి వస్తుంది. నువ్వు ఏం ఎంచుకుంటావో అదే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది` అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Once in a while life would give you an opportunity to choose between money and legacy. Whatever you choose will define you for the rest of your life.
— Aakash Chopra (@cricketaakash) November 27, 2023
హార్ధిక్ కెప్టెన్సీ కోసం ముంబై నుంచి గుజరాత్కు మారాడని, అక్కడ కెప్టెన్సీ వచ్చి టీమిండియా సారథిగా ఎంపికైనా మళ్లీ ముంబైకి మళ్లడం వెనుక ఉన్న కారణాలేంటోనని అభిమానులు వాపోతున్నారు. హార్ధిక్ కెరీర్లో ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి అసలు పాండ్యా.. గుజరాత్ను ఎందుకు వీడాడు..? అన్న ప్రశ్నకు అతడు మాత్రమే సమాధానం చెప్పాలి.