IND vs SA: ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్కప్లో ఆడిన ఏడు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న టీమ్ఇండియాకు పరాజయం రుచి చూపిస్తామని దక్షిణాఫ్రికా జట్టు సారథి బవుమా అన్నాడు. మెగాటోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన తొలి మ్యాచ్లో ఘనవిజయం సాధించిన రోహిత్ సేన ఆ తర్వాత వరుసగా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకపై విజయాలు సాధించి 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలువడంతో పాటు.. ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది.
టోర్నీలో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్కు ముందు రోజు సఫారీ జట్టు సారథి బవుమా మాట్లాడుతూ.. ‘టోర్నీలో అపజయం లేకుండా సాగుతున్న భారత్ రికార్డును బ్రేక్ చేస్తాం. సొంతగడ్డపై ఆ జట్టు చాలా కఠిన ప్రత్యర్థి. అయినా.. మా దగ్గర తగిన వ్యూహాలు ఉన్నాయి. వాటిని మైదానంలో ఆచరణలో పెడతాం. తప్పక భారత్పై విజయం సాధిస్తామనే నమ్మకముంది’ అని అన్నాడు.
దాదాపు 80 వేల మంది అభిమానులు ఈ మ్యాచ్కు హాజరు కానుండగా.. ప్రేక్షకుల హోరుతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బవుమా అన్నాడు. ‘భారీ జన సందోహం ముందు ఆడటం ఎవరికైనా ఇష్టమే. అందులో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా చెప్పాలంటే అది మమ్మల్ని మరింత ఉత్సాహ పరుస్తుంది. స్టేడియం మొత్తం బ్లూ జెర్సీలు నిండిపోతాయని మాకు తెలుసు. అయినా మా ప్రణాళికలను అమలు చేస్తే తప్పక విజయం సాధిస్తాం. ఒక్కో ఆటగాడి కోసం ప్రత్యేకంగా వ్యూహాలు రచించాం’ అని బవుమా పేర్కొన్నాడు.