దుబాయ్: ఐపీఎల్( IPL 2021 )లో ఢిల్లీ, కోల్కతా మ్యాచ్లో భాగంగా అశ్విన్, మోర్గాన్ మధ్య జరిగిన ఫైట్పై క్రికెట్ ప్రపంచం రెండుగా చీలిపోయింది. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొందరు మోర్గాన్ వైపు నిలబడుతుండగా.. మరికొందరు అశ్విన్ను వెనకేసుకొస్తున్నారు. ఆ మ్యాచ్లో ఫీల్డర్ విసిరిన త్రో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్కు తగిలి ఓవర్త్రోగా వెళ్లింది. దీంతో అశ్విన్, పంత్ మరో పరుగు తీశారు. ఇది క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమంటూ కోల్కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. అశ్విన్తో వాదనకు దిగాడు. అశ్విన్ కూడా ఘాటుగా స్పందించడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగింది.
మోర్గాన్కు ఇలాంటివి నచ్చవని, బాల్ ఓ బ్యాట్స్మన్ లేదా బ్యాట్కు తగిలి దూరంగా వెళ్లినప్పుడు పరుగు తీయకూడదని అతడు భావిస్తాడని మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్ అన్నాడు. ఈ కామెంట్స్పై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చాలా ఘాటుగా స్పందించాడు. మోర్గాన్తోపాటు కార్తీక్పై కూడా సెటైర్ వేశాడు. 2019 వరల్డ్కప్ ఫైనల్లో మోర్గాన్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా వీరూ గుర్తు చేశాడు. జులై 14, 2019లో చివరి ఓవర్లో బాల్ ఇలాగే బెన్ స్టోక్స్ బ్యాట్కు తగిలి వెళ్లింది. మరి అప్పుడు మోర్గాన్ లార్డ్స్ బయట ధర్నాకు కూర్చొని, వరల్డ్కప్ ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించాడు. దీంతో న్యూజిలాండ్ గెలిచింది కదా? భలే చెప్పొచ్చావ్ లే అంటూ కార్తీక్, మోర్గాన్లను అదిరిపోయే పంచ్ ఇచ్చాడు సెహ్వాగ్.
ఆ మ్యాచ్లో స్టోక్స్ బ్యాట్కు తగిలిన బాల్ బౌండరీకి వెళ్లింది. చివరికి మ్యాచ్ టై కావడం, ఆ తర్వాత సూపర్ ఓవర్లోనూ ఇంగ్లండ్, న్యూజిలాండ్ స్కోర్లు సమం కావడంతో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను విజేతగా తేల్చారు. ఇదే విషయాన్ని ఇప్పడు సెహ్వాగ్ గుర్తు చేస్తూ ఇలా పంచ్ వేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ కూడా ఈ వివాదంపై స్పందించాడు. కాకపోతే అతడు మోర్గాన్కు మద్దతుగా నిలిచాడు. అశ్విన్ మరోసారి క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తాడు? అలా చేసినప్పుడు మోర్గాన్కు దానిని అడ్డుకునే హక్కు ఉంది. ఇలాంటిది ఎప్పుడూ జరిగి ఉండాల్సింది కాదు అని ట్వీట్ చేశాడు.