లింగాలఘనపురం, మార్చి 30 : ఉపాధిహామీ పథకంలో చేపట్టే పనులు బహుళప్రయోజనకరంగా ఉండాలని, నాణ్యతలోపిస్తే చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో రాంరెడ్డి అన్నారు. మండలంలోని నెల్లుట్లలో వాగు నుంచి వ్యవసాయ బావులకు వెళ్లే రోడ్డు పనులు చేపట్టగా మంగళవారం ఆయన పరిశీలించా రు. రాంరెడ్డి మాట్లాడుతూ ప్రతి కూలీకి రూ.237 చెల్లిస్తామన్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 11 గంటల వరకే పనులు చేయాలని సూచించారు. పనులకు వచ్చే కూలీలు తాగు నీటిని వెంట తెచ్చుకోవాలని, ఇందుకుగాను ప్రతిఒక్కరికీ వారి అకౌంటులో ప్రతి రోజూ రూ.5 జమ చేస్తామని రాంరెడ్డి అన్నారు. నెల్లుట్లలో నూతనంగా చేపట్టిన రోడ్డుతో వాగుకు ఇరువైపులా 20 వ్యవసాయ బావుల రైతులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కొండల్రెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో మల్లికార్జున్, ఏపీవో రాజకర్ణ, ఎఫ్టీ ఐలయ్య పాల్గొన్నారు.