Rajkumar Sharma : భారత జట్టు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పునరాగమనంపై అతను విరాట్ కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీతో పునరాగనం చేస్తున్న జడేజా రాణించడంపై తాను ఆందోళన చెందుతున్నానని అన్నాడు. ఆసీస్తో సిరీస్ అతనికి అంత సులభం కాదని రాజ్ కుమార్ తెలిపాడు. ‘టెస్టు క్రికెట్లో రీ-ఎంట్రీలో ఇస్తున్న జడేజా రాణించడంపై నాకు ఆందోళనగా ఉంది. అందుకు కారణం ఏంటంటే.. అతను చాలా రోజులగా అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. జడ్డూ ప్రపంచంలో ఫిట్గా ఉన్న ఆటగాళ్లలో ఒకడు. అయితే.. అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో అది కూడా అస్ట్రేలియాపై పునరాగమనం చేస్తున్నాడు. అందుకని ఈ సిరీస్లో రాణించడం అతనికి అంత సులభం కాదు’ అని రాజ్కుమార్ వెల్లడించాడు. 1998లో ఢిల్లీ క్రికెట్ అకాడమీలో రాజ్కుమార్ శర్మ దగ్గర కోహ్లీ ట్రైనింగ్ తీసుకున్నాడు.
రంజీ మ్యాచ్లో 8 వికెట్లు
పోయిన ఏడాది ఆసియా కప్లో మోకాలి గాయం కావడంతో జడ్డూ టీ20 వరల్డ్ కప్కి దూరమయ్యాడు. 34 ఏళ్ల ఈ ఆల్రౌండర్ ఆగష్టులో చివరిసారిగా మైదానంలో దిగాడు. అయితే.. గాయం నుంచి కోలుకున్న అతను ఫిట్నెస్ పరీక్షలో నెగ్గాడు. దాంతో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టులకు బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. దాదాపు ఆరు నెలల విరామం మైదానంలోకి దిగిన జడేజా రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఒక మ్యాచ్ ఆడాడు. తమిళనాడుపై 8 వికెట్లు తీసి, టెస్టు క్రికెట్లో తాను ఎంత కీలకమో మరోసారి చాటాడు. అల్రౌండర్గా ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన జడేజాకు ఆసీస్ సిరీస్ నిజంగానే పరీక్ష కానుంది. బ్యాటుతో, బంతితో అతను రాణించడం భారత్కు చాలా ముఖ్యం. ఫిబ్రవరి 9న నాగ్పూర్లో తొలి టెస్టులో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.