టోక్యో: ఈసారి ఒలింపిక్స్ రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ తెస్తుందని భావిస్తున్న స్టార్ రెజ్లర్ వినేష్ పోగాట్ టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకుంది. కోచ్ వోలెట్ అకోస్తో కలిసి శిక్షణ కోసం హంగరీ వెళ్లిన ఆమె.. యురోపియన్ యూనియన్ వీసాపై ఒకరోజు ఎక్కువగా అక్కడ ఉంది. దీంతో మంగళవారం రాత్రి టోక్యో విమానం ఎక్కడానికి వచ్చిన ఆమెను.. అధికారులు అడ్డుకున్నారు. తాను ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవడంతో వినేష్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే దీనిపై స్పందించిన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్.. సమస్య పరిష్కారమైనట్లు చెప్పింది.
వినేష్ బుధవారం టోక్యో వెళ్తుందని స్పష్టం చేసింది. వీసా గడువు సరిగా చూడలేదు. ఇది కావాలని చేసింది కాదు. ఆమె 90 రోజుల పాటు అక్కడ ఉండాల్సి ఉండగా.. ఆమె ఫ్రాంక్ఫర్ట్ చేసే సరికి 91వ రోజు అయింది అని ఐవోఏ వెల్లడించింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్లగా.. వాళ్లు వెంటనే జర్మనీలోని ఇండియన్ కాన్సులేట్కు సమాచారాన్ని చేరవేశారు అని తెలిపింది. మంగళవారం రాత్రి ఫ్రాంక్ఫర్ట్లోనే ఉన్న వినేష్కు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్లు చేశారు.
బుధవారం టోక్యోలో ల్యాండైన తర్వాత మరోసారి ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో ఇండియాకు గోల్డ్ మెడల్ ఆశలు రేపుతోంది వినేష్ పోగాట్. ఆమె టాప్ సీడ్గా బరిలోకి దిగుతోంది. వచ్చే నెల 5న ఒలింపిక్స్లో ఆమె పోటీలు ప్రారంభమవుతాయి. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన ఆమె.. వరల్డ్ చాంపియన్షిప్స్లో బ్రాంజ్ గెలిచింది.