ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు సత్తాచాటేందుకు మరో టోర్నీ సిద్ధమైంది. బుధవారం నుంచి దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 15వ సీజన్కు ముందు ప్రస్తుతం ఉన్న ఎనిమిది జట్లు తమకు నచ్చిన ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. కొత్తగా లీగ్లో అడుగుపెట్టనున్న మరో రెండు జట్లతో పాటు మిగిలిన జట్లన్నీ వచ్చే నెలలో జరుగనున్న మెగావేలంలో ప్లేయర్లను కొనుగోలు చేసుకోనున్న నేపథ్యంలో యువ ఆటగాళ్లకు ఈ టోర్నీ చక్కటి వేదిక కానుంది. హర్షల్ పటేల్, దీపక్ చాహర్, రాహుల్ చాహర్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి వంటి వాళ్లు ఈ టోర్నీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా.. తొలి మ్యాచ్లో తమిళనాడుతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరుగనున్న ఈ టోర్నీలో మొత్తం 38 జట్లు.. ఆరు గ్రూప్లుగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఏడు వేదికల్లో జరుగనున్న ఈ టోర్నీలో.. హర్యానా, ఢిల్లీ, సౌరాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్తో కలిసి హైదరాబాద్ గ్రూప్-‘సి’లో ఉంది. గ్రూప్-‘సి’మ్యాచ్లన్నీ మొహాలీలో జరుగనుండగా.. తొలి పోరులో బుధవారం హర్యానాతో హైదరాబాద్ తలపడనుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి.