పారిస్: భారత స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ వరల్డ్కప్ స్టేజ్-3లో డబుల్ ధమాకా మోగించింది. కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో అభిషేక్ వర్మతో కలిసి పసిడి చేజిక్కించుకున్న తెలుగమ్మాయి.. వ్యక్తిగత విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది.
మిక్స్డ్ కాంపౌండ్ ఈవెంట్లో భారత్కు బంగారు పతకం లభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. శనివారం జరిగిన మిక్స్డ్ ఫైనల్లో జ్యోతి-అభిషేక్ జంట 152-149తో ఫ్రెంచ్ ద్వయంపై విజయం సాధించింది. అనంతరం వ్యక్తిగత విభాగంలో ప్రపంచ మూడో ర్యాంకర్ జ్యోతి షూట్ ఆఫ్లో తడబడి రజతం ఖాతాలో వేసుకుంది. ఇదే టోర్నీ మహిళల రికర్వ్ విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లిన దీపిక, అంకిత, సిమ్రన్జిత్ బృందం.. ఆదివారం స్వర్ణ పోరు బరిలో దిగనుంది.