UPW vs GG : మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్లో దారుణంగా ఓడిపోయిన గుజరాత్ జెయింట్స్ మరో పరాభవం. డీవై పాటిల్ స్టేడియంలో యూపీ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఉత్కంఠపోరులో యూపీ వారియర్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. గ్రేస్ హ్యారిస్ (59) అర్ధ సెంచరీతో జట్టును గెలిపించింది. 170 లక్ష్య ఛేదనలో కిమ్ గార్త్ దెబ్బకు ఆ జట్టు 105 రన్స్కే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో సోఫీ ఎక్లెస్టోన్, గ్రేస్ హ్యారిస్ 8వ వికెట్కు 70 రన్స్ చేశారు.
కిమ్ గార్త్ ఐదు వికెట్లతో యూపీని హడలెత్తించింది. కిరణ్ నవ్గిరే (53), ఎలిసా హేలీ (7), శ్వేతా షెరావత్(5), తహిలా మెక్గ్రాత్, సిమ్రాన్ షేక్లను ఆమె పెవిలియన్ పంపింది. నాలుగో వికెట్కు కిరణ్ నవ్గిరే (53), దీప్తి శర్మ (11) 66 పరుగులు జోడించారు. దీప్తిని మన్షి జోషి ఔట్ చేసి బ్రేక్ ఇచ్చింది. 13 రన్స్ వద్ద యూపీ మొదటి వికెట్ పడింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ (46) రాణించడంతో ఆ జట్టు అంత స్కోర్ చేయగలిగింది. 76 రన్స్కే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో.. గార్డ్నర్, హర్లీన్ వేగంగా ఆడి జట్టు భారీ స్కోర్కు బాటలు వేశారు. ఓపెనర్లు సబ్బినేని మేఘన (24), సోఫియా డంక్లే (13) స్వల్ప స్కోర్కే వెనుదిరిగారు. ఆషే గార్డ్నర్ (25), దయలాన్ మేహలత (21 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడారు. యూపీ వారియర్స్ బౌలర్లలో ఎక్లెస్టోన్ దీప్తి శర్మ తలా రెండు వికెట్లు తీశారు. అంజలి సర్వాని, తహిలా మెక్గ్రాత్కు ఒక్కో వికెట్ దక్కింది. తొలి మ్యాచ్లో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కెప్టెన్ బేత్ మూనీ ఈ మ్యాచ్ ఆడలేదు. డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్లో గుజరాత్ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో 143 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.