మూడో టెస్టుకు ఉమేశ్ స్థానంలో నటరాజన్..!

మెల్బోర్న్: టీమ్ఇండియా ఫాస్ట్బౌలర్లు గాయాల బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాల కారణంగా ఆస్ట్రేలియా పర్యటనకు దూరంకాగా ఆసీస్తో తొలి టెస్టులో గాయపడిన సీనియర్ పేసర్ మహ్మద్ షమీ సిరీస్లోని మిగతా మ్యాచ్లకూ దూరమయ్యాడు. ఆసీస్తో బాక్సింగ్ డే టెస్టులో బౌలింగ్ చేస్తుండగా మరో బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తుండగా పిక్క పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. మూడో టెస్టుకు అతడు అందుబాటులో ఉండటం కూడా అనుమానమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
అతని స్కానింగ్ రిపోర్టులు వచ్చాయి. మూడో టెస్టుకు దూరంకానున్నాడు. జనవరి 15న ఆఖరి టెస్టు ఆరంభంకానుండటంతో అప్పటి వరకు రెండు వారాల కన్నా ఎక్కువ సమయం ఉండటంతో చివరి టెస్టులో మళ్లీ ఆడాలనుకుంటున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఉమేశ్ స్థానంలో యార్కర్ స్పెషలిస్ట్ టీ నటరాజన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జనవరి 7వ తేదీ నుంచి సిడ్నీ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.