Uganda: తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండా సంచలనం సృష్టించింది. టెస్టు హోదా కలిగిన జింబాబ్వేను ఓడించి ఔరా అనిపించింది. అంతర్జాతీయ స్థాయిలో టెస్టు, వన్డే, టీ20 హోదా కలిగిన జట్టుపై గెలవడం ఆ జట్టుకు ఇదే ప్రథమం. వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా నిర్వహించనున్న ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆఫ్రికన్ రీజియన్ నుంచి నిర్వహిస్తున్న క్వాలిఫయర్స్ పోటీలలో ఉగాండా.. జింబాబ్వేను చిత్తు చేసింది. మొదట జింబాబ్వేను 136 పరుగులకే పరిమితం చేసిన ఆ జట్టు.. లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింది.
నమీబియా రాజధాని విండ్హోక్ లోని యూనైటెడ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఉగాండా టాస్ గెలిచి జింబాబ్వేను బ్యాటింగ్కు ఆహ్వానించింది. జింబాబ్వే సారథి సికందర్ రజా 39 బంతుల్లో రెండు బౌండరీలు, నాలుగు సిక్సర్ల సాయంతో 48 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. సీన్ విలియమ్స్ (21) ఫర్వాలేదనిపించాడు. ఉగాండా బౌలర్లలో భారత సంతతి ఆటగాడు దినేశ్ నక్రానీ మూడు వికెట్లు తీయడమే గాక నాలుగు ఓవర్లలో 12 పరుగులే ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
Rise up Ugandans, historic day of Uganda Cricket @CricketUganda victory against Zimbabwe in the World Cup qualifier…beaten a test nation and gotten a step closer to first ever senior World Cup next year.
Can’t be prouder of the lads led by @BrianX49 👏👏👏#SportsThatPerform pic.twitter.com/CcxuHUP65i— Karashani Davis ©️ (@davour23) November 26, 2023
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అల్పేశ్ రంజానీ (26 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 40), రియాజత్ అలీ షా (28 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 42)లు రాణించి ఉగాండాకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో ఉగాండాకు ఆడిన మూడు మ్యాచ్లలో రెండో విజయం. అంతకుముందు టాంజానియాను ఓడించిన ఉగాండా.. నమీబియా చేతిలో ఓడింది. తన తర్వాతి మ్యాచ్లలో ఆ జట్టు నైజీరియా, రువాండా, కెన్యాతో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లలో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చోటు దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి.