హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ బాలికల జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో తెలంగాణ 14-4 తేడాతో అస్సాంపై ఘన విజయం సాధించింది. ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన తెలంగాణ అమ్మాయిలు.. వరుస పాయింట్లతో మ్యాచ్ను అలవోకగా కైవసం చేసుకున్నారు. లక్నో వేదికగా ప్రారంభమైన ఈ పోటీలను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్కే తివారీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) సహకారం పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉంది. కరోనా వైరస్తో స్తంభించిపోయిన క్రీడా పోటీలను అన్ని జాగ్రత్తల మధ్య పునఃప్రారంభించాం. ఈ చాంపియన్షిప్లో వివిధ రాష్ర్టాలకు చెందిన 24 జట్లు, దాదాపు 600 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారు. క్రీడాకారులందరూ సత్తాచాటాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్ఐ కోశాధికారి ఆనందీశ్వర్పాండే, యూపీ క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి కల్పన తదితరులు పాల్గొన్నారు.