న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్లో రజత పతకంతో చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను సోమవారం స్వదేశానికి చేరుకుంది. ఇందిరాగాంధీ విమానాశ్రయానికి విచ్చేసిన మీరాబాయితో పాటు కోచ్ విజయ్ శర్మకు క్రీడాభిమానులు ఘన స్వాగతం పలికారు. ‘భారత్ మాతా కీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రత్యేకమైన భద్రత మధ్య విమానాశ్రయం నుంచి బయల్దేరిన మీరాకు కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీరా మాట్లాడుతూ ‘ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న నా కల నిజమైంది. విశ్వక్రీడా వేదికపై స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు ఇన్నేండ్లు కష్టపడ్డాను. ఈ క్లిష్ట సమయంలో నా వెన్నంటి నిలిచిన దేశ ప్రజలకు ఒలింపిక్స్ పతకాన్ని అంకితమిస్తున్నాను. నా గెలుపు ప్రయాణంలో సహకరించిన భారత ప్రభుత్వానికి రుణపడి ఉంటాను’ అని పేర్కొంది. మరోవైపు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ మాట్లాడుతూ ‘ఒలింపిక్స్ తొలి రోజు పోటీల్లోనే పతకం గెలిచి 135 కోట్ల భారతీయుల ముఖాలపై చిరునవ్వు తీసుకొచ్చావు. మీరా నిన్ను చూసి దేశం మొత్తం గర్వపడుతున్నది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రు లు కిషన్రెడ్డి, కిరణ్ రిజిజు, సర్బనంద్ సొనోవాల్ పలువురు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే మణిపూర్ ప్రభుత్వం కోటి నజరానాతో పాటు ఏఎస్పీగా మీరాను నియమిస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు చైనా లిఫ్టర్ జిహుయి గనుక డోపింగ్లో పాజిటివ్గా తేలితే మీరాకు స్వర్ణం దక్కే చాన్స్ ఉంది.