పోచెఫ్స్ట్రూమ్: ఐసీసీ మహిళల తొలి అండర్-19 టీ20 ప్రపంచకప్ ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. ఆదివారం భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగునుంది. ఐసీసీ మొదటిసారి తీసుకొచ్చిన పొట్టి ప్రపంచకప్ దక్కించుకునేందుకు ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. మెగాటోర్నీలో మ్యాచ్ మ్యాచ్కు రాటుదేలుతున్న యువ భారత్..ఫైనల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మినహాయిస్తే ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేసిన టీమ్ఇండియా అద్భుతంగా పుంజుకుంది. ముందంజ వేయాలంటే భారీ గెలుపు తప్పనిసరైన పరిస్థితుల్లో లంకను చిత్తుచేస్తూ సెమీస్లో కివీస్ రెక్కలు విరిచింది. మరోవైపు ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మరో సెమీస్లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ ఉత్కంఠ విజయం సాధించింది.
భారీ అంచనాల మధ్య: మెగాటోర్నీలో టీమ్ఇండియా తరఫున శ్వేతా షెరావత్ నిలకడగా రాణిస్తున్నది. 292 పరుగులతో శ్వేత టాప్లో కొనసాగుతుండగా, షెఫాలీ వర్మ(157) మూడో స్థానంలో ఉంది. ఇంగ్లండ్తో ఫైనల్లో వీరిద్దరు బ్యాట్లు ఝుళిపిస్తే భారత్కు తిరుగుండకపోవచ్చు. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అవకాశం వచ్చినప్పుడల్లా సత్తాచాటుతూనే ఉన్నది.