న్యూఢిల్లీ: క్రీడలను డోపింగ్ భూతం పట్టిపీడిస్తూనే ఉన్నది. ఎన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నా..ఫలితం అంతగా కనిపించడం లేదు. రెండు సార్లు కామన్వెల్త్ గేమ్స్ పసిడి పతక విజేత సంజితా చానుపై వేటు పడింది. నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్న కారణంగా చానుపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ(నాడా) నాలుగేండ్ల నిషేధం విధించింది. సస్పెన్షన్ వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొన్న నాడా..21 రోజుల్లోపు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. గతేడాది గుజరాత్ వేదికగా జరిగిన నేషనల్ గేమ్స్ సందర్భంగా సంజిత నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. అంతర్జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (వాడా) నిషేధిత జాబితాలో ఉన్న డ్రోస్టాలోన్ మెటాబొలైట్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. నాడా ఏడీఆర్ 2021 ఆర్టికల్ 2.1, 2.2 ప్రకారం చానుపై నాలుగేండ్ల నిషేధం పడిందని యాంటీ డోపింగ్ క్రమశిక్షణ కమిటీకి నేతృత్వం వహించిన చైతన్య మహాజన్ పేర్కొన్నాడు.