Cricketeres – Retirement Record : క్రికెటర్లకు రిటైర్మెంట్(Retirement) ప్రకటించడానికి మించిన బాధ మరొకటి ఉండదు. జట్టు నుంచి వేరుకాబోతున్నామన్న బాధ, మైదానం తమకు దూరమవుతుందన్న ఆవేదన చుట్టుముట్టేస్తుంది. అందుకే వీడ్కోలు రోజు ఆటగాళ్లు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే.. కొందరు ఆటగాళ్లు దేశం కోసం నిర్ణయం మార్చుకుని మళ్లీ జెర్సీ తొడుక్కున్న సందర్భాలు ఉన్నాయి. పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Shaheed Afridi) రిటైర్మెంట్ల విషయంలోనూ రికార్డు సృష్టించాడు. ఇక, ఇమ్రాన్ ఖాన్(Imran Khan) అయితే మళ్లీ జట్టులోకి వచ్చి ఏకంగా ప్రపంచ కప్ కొల్లగొట్టాడు. క్రికెట్కు వీడ్కోలు పలికి మళ్లీ మైదానంలోకి స్టార్ ఆటగాళ్ల జాబితాలోకి తాజాగా ఇంగ్లండ్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్(Ben Stokes) చేరాడు.
ఇంగ్లండ్ స్టార్ బెన్ స్టోక్స్(Ben Stokes) నిరుడు జూలైలో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ 2019 వరల్డ్ కప్ హీరో సంచలన నిర్ణయంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అతడిని మళ్లీ మైదానంలో చూడాలనుకున్న వారి ఆశలు ఫలించాయి. స్టోక్స్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్లో తన ఆటతో అభిమానులను మరోమారు అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.
బెన్ స్టోక్స్
అయితే.. మొదట్లో స్టోక్స్ తన పునరామనం వార్తల్ని ఖండించాడు. అలాంటిదేమీ లేదని, యాషెస్ సిరీస్ ముగిసిన వెంటనే వెకేషన్ కోసం వెళ్తున్నట్టు పేర్కొన్నాడు. దీంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే, అనూహ్యంగా అతడి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. కివీస్తో నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో అనూహ్యంగా స్టోక్స్ పేరు కూడా వచ్చి చేరింది. దీంతో అతడి అభిమానుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ నెలలో న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది.
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్(Imran Khan) ఒకడు. అతను 1987లో క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. అయితే అప్పటి పాక్ అధ్యక్షుడు జియా ఉల్ హక్ అభ్యర్థన మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని 1988లో మైదానంలో అడుగుపెట్టాడు. ఆ నిర్ణయం పాకిస్థాన్కు ఎంతో మేలు చేసింది. ఇమ్రాన్ నేతృత్వంలోని పాక్ జట్టు 1992లో ప్రపంచ కప్ను సగర్వంగా అందుకుంది.
1992లో వరల్డ్ కప్ ట్రోఫీతో ఇమ్రాన్ ఖాన్
ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్ చివరి వికెట్ను నేలకూల్చి క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతేకాదు పాక్ చారిత్రక విజయం తర్వాత ఇమ్రాన్ తన తల్లి పేరుతో దేశంలోనే తొలి కేన్సర్ దవాఖాన `షౌకత్ ఖానూమ్ మెమోరియల్ కేన్సర్ హాస్పిటల్`ను నిర్మించాడు. తన తల్లిలా మరెవరూ క్యాన్సర్తో చనిపోకూడదన్న ఉదాత్తమైన ఆశయంతో ఆ దవాఖాన నిర్మించాడు.
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది(Shaheed Afridi) పలుమార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఎక్కువసార్లు రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ ఆడిన ఆటగాడిగా అఫ్రిది పేరు రికార్డుల్లోకి ఎక్కింది. వన్డేలపై దృష్టి పెట్టేందుకు ఈ ఆల్రౌండర్ 2006లో టెస్టులకు గుడ్బై చెప్పేశాడు. ఆ తర్వాత రెండు వారాలకే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. కేవలం ఒక్కే ఒక్క టెస్టు ఆడి మళ్లీ టాటా చెప్పేశాడు. 2010లో ఆస్ట్రేలియాతో అఫ్రిది సారథ్యంలో జరిగిన టెస్టులో పాక్ ఓటమి పాలైంది.
షాహిద్ అఫ్రిది
వన్డే ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ నుంచి తొలగించడంతో 2011లో వన్డేలకు కూడా వీడ్కోలు పలికాడు. ఐదు నెలల తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. చివరికి 2017లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ఆ తర్వాత అఫ్రిది మళ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు.
ఇంగ్లండ్ జట్టుకు విశేష సేవలందించిన అద్భుత బ్యాటర్ కెవిన్ పీటర్సన్(kevin pietersen). 2005 యాషెస్ సిరీస్లో ఆసీస్ బౌలింగ్ ఎటాక్ను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. పీటర్సన్ ఆ సిరీస్లోనే అత్యధిక పరుగులు సాధించాడు. ఆ తర్వాత మూడు ఫార్మాట్లలోనూ పరుగుల వరద పారించాడు. 2010 టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పీటర్సన్ పోషించాడు. ఆ టోర్నీలో ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.
కెవిన్ పీటర్సన్
కెరియర్ పీక్లో ఉన్న సమయంలో బోర్డుతో సమస్యల కారణంగా వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, సరిగ్గా 60 రోజుల తర్వాత యూటర్న్ తీసుకున్నాడు. ఆ తర్వాత 8 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే.. మైదానం వెలుపల పలు వివాదాల్లో చిక్కుకోవడంతో జనవరి 2014 నుంచి క్రికెట్కు పూర్తిగా దూరమయ్యాడు. చివరికి 2018లో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు పీటర్సన్ ప్రకటించాడు.
టీమిండియా గ్రేటెస్ట్ సీమర్లలో జవగళ్ శ్రీనాథ్(Javagal Srinath) ఒకడు. వన్డేల్లో 315 వికెట్లతో భారత్ తరపున ఈ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా రికార్డులకెక్కాడు. కొన్నేళ్లపాటు భారత బౌలింగ్కు వెన్నెముకగా నిలిచిన అతడి ఖాతాలో 550 వికెట్లు ఉన్నాయి. 2002లో కరీబియన్ టూర్ తర్వాత సడెన్గా శ్రీనాథ్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.
జవగళ్ శ్రీనాథ్
అయితే, అప్పటి స్కిప్పర్ సౌరవ్ గంగూలీ() ప్రోద్బలంతో రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని 2003 ప్రపంచ కప్లో ఆడాడు. 11 మ్యాచుల్లో 16 వికెట్లు తీసి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన రెండో భారత బౌలర్ అతడే. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయింది. దాంతో, బాధాతప్త హృదయంతో శ్రీనాథ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు.