ఆసియా క్రీడల్లో వరుసగా రెండో రోజు భారత అథ్లెట్లు అదరగొట్టారు. తొలి రోజు ఐదు పతకాలతో పాంచ్ పటాకా మోగిస్తే.. రెండో రోజు రెండు స్వర్ణాలు సహా ఆరు మెడల్స్తో సిక్సర్ కొట్టారు.
క్రికెట్లో ఎదురే లేకుండా దూసుకెళ్లిన భారత మహిళల జట్టు పసిడి కాంతులు విరజిమ్మగా.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో రుద్రాంక్ష్, ప్రతాప్ సింగ్, దివ్యాన్ష్ సింగ్ త్రయం రికార్డు స్కోరుతో బంగారు పతకం కైవసం చేసుకుంది. వ్యక్తిగత విభాగంలో ప్రతాప్ కాంస్యం ఖాతాలో వేసుకుంటే.. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ ఈవెంట్లో భారత జట్టుకు కంచు మోత మోగించింది. అలలపై ప్రత్యర్థులను అల్లాడించిన మన రోవర్లు మరో రెండు కాంస్యాలు ఖాతాలో వేసుకోవడంతో.. ఓవరాల్గా ఆరు పతకాలు నెగ్గిన భారత్.. పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.
టెన్నిస్లో భారీ ఆశలతో బరిలోకి దిగిన రోహాన్ బోపన్న జోడీ రెండో రౌండ్లోనే నిష్క్రమించగా.. వుషూలో రోషిబినా దేవి సెమీస్కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకుంది.
Asian Games | హాంగ్జౌ: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట ద్విగిజయవంతంగా కొనసాగుతున్నది. తొలి రోజు ఐదు పతకాలు సాధించిన మనవాళ్లు రెండో రోజు మరో ఆరు మెడల్స్ ఖాతాలో వేసుకున్నారు. మహిళల క్రికెట్లో భారత జట్టు తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. స్వర్ణం కైవసం చేసుకోగా.. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్, ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాన్ష్ సింగ్ పన్వర్తో కూడిన భారత జట్టు పసిడి గెలిచింది. ప్రతాప్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం నెగ్గగా.. 25 మీటర్ల టీమ్ ర్యాపిడ్ ఫైర్లో అనీష్ భన్వాల్, విజయ్వీర్ సిధు, ఆదర్శ్ సింగ్ త్రయం కాంస్యం గెలిచింది. తొలి రోజు పోటీల్లో మూడు పతకాలతో మెరిసిన రోవర్లు..
సోమవారం మరో రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో వేశారు. పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్లో సత్నామ్ సింగ్, పర్మిందర్ సింగ్, జకార్ ఖాన్, సుఖ్మీత్ సింగ్ బృందం కాంస్యం గెలువగా..పురుషుల ఫోర్స్ ఈవెంట్లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశీస్ గోలియాన్ కంచు మోత మోగించారు. వీరితో పాటు పలు ఈవెంట్లలో భారత ప్లేయర్లు ముందంజ వేయగా.. టెన్నిస్లో మన వాళ్లకు పెద్ద షాక్ ఎదురైంది. కచ్చితంగా స్వర్ణం నెగ్గుతుందని ఆశించిన రోహాన్ బోపన్న-యూకీ బాంబ్రీ జంట రెండో రౌండ్లోనే పరాజయం పాలై ఏషియన్ గేమ్స్ నుంచి నిష్క్రమించగా.. వుషూలో రోషిబినా దేవి సెమీస్కు దూసుకెళ్లి కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది.
షూటింగ్లో అదరహో..
ఆసియా క్రీడల చరిత్రలో భారత్కు అత్యధిక పతకాలు అందించిన షూటింగ్లో ఈ సారి కూడా మనవాళ్లు సత్తాచాటారు. పోటీల రెండో రోజు మన షూటర్లు మూడు పతకాలు నెగ్గారు అందులో ఓ స్వర్ణం, రెండు కాంస్యాలు ఉన్నాయి. ఓవరాల్గా తొలి రోజు షూటర్లు రెండు మెడల్స్ గెలువగా.. ప్రస్తుతం మొత్తంగా మన గురికి ఐదు మొడల్స్ పట్టికలో చేరాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో టీనేజ్ కుర్రాడు రుద్రాంక్ష్ సారథ్యంలో బరిలోకి దిగిన భారత జట్టు తొలి స్వర్ణం గెలిచింది. ఈ క్రమంలో భారత జట్టు వరల్డ్ రికార్డు స్కోరు నమోదు చేయడం గమనార్హం. రుద్రాంక్ష్, దివ్యాన్ష్, ప్రతాప్ త్రయం తుదిపోరులో 1893.7 స్కోరు చేసింది. ఈ విభాగంలో చైనా, దక్షిణ కొరియా వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. 10 మీటర్ల వ్యక్తిగత రైఫిల్ విభాగంలో ప్రతాప్ సింగ్ కాంస్యం నెగ్గాడు. మూడో స్థానం కోసం భారత్కే చెందిన ప్రతాప్, రుద్రాంక్ష్ మధ్య పోటీ జరగగా.. ప్రతాప్ ముందంజ వేశాడు. ఇక 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీష్, విజయ్వీర్, ఆదర్శ్ సింగ్తో కూడిన భారత జట్టు 1718 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది.
జకార్తాలో జరిగిన 2018 ఆసియా క్రీడల్లో మన రోవర్లు మూడు పతకాలు సాధిస్తే.. ఈ సారి ఆ సంఖ్యను ఐదుకు పెంచారు. పోటీల తొలి రోజు ఆదివారం మూడు మెడల్స్ నెగ్గిన రోవర్లు సోమవారం మరో రెండు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో వేశారు. పురుషుల క్వాడ్రపుల్ స్కల్స్లో సత్నామ్ సింగ్, పర్మిందర్ సింగ్, జకార్ ఖాన్, సుఖ్మీత్ సింగ్ బృందం కాంస్యం గెలువగా..పురుషుల ఫోర్స్ ఈవెంట్లో జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశీస్ గోలియాన్ కంచు మోత మోగించారు. ఇందులో 23 ఏండ్ల పర్మిందర్ సింగ్ మరో రికార్డు సృష్టించాడు. 2002లో బుసాన్ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో పర్మిందర్ సింగ్ తండ్రి ఇందర్పాల్ సింగ్ కాంస్య పతకం గెలువగా.. ఇప్పుడు పర్మిందర్ ఆ ఫీట్ను రిపీట్ చేశాడు.
బాక్సింగ్: సచిన్ (51 కేజీలు), నరిందర్ (ప్లస్ 92 కేజీలు) చెస్: హంపీ, హారిక, అర్జున్, విదిత్ ఆరో రౌండ్ మ్యాచ్లు
ఫెన్సింగ్: భవాని దేవి (వ్యక్తిగత సబ్రె విభాగం) హాకీ: భారత్ x సింగపూర్ (పురుషులు)
సెయిలింగ్: సావరిముత్తు, సిద్ధేశ్వర్, పురుషుల స్కీవ్, మహిళల స్కీఫ్
షూటింగ్: ఇషాసింగ్, మనూ భాకర్, రిథమ్ సాంగ్వాన్ (25 మీ. పిస్టల్) క్వాలిఫయింగ్ రౌండ్
స్కాష్: భారత్ x పాకిస్థాన్ (మహిళలు) గ్రూప్ దశ
స్విమ్మింగ్: సజన్ ప్రకాశ్, నటరాజ్, సెల్వరాజ్, మాథ్యూ (పురుషుల 4×400 మెడ్లీ రిలే).
వాలీబాల్: భారత్xపాకిస్థాన్ (పురుషుల క్లాసిఫికేషన్)
వుషు: సురజ్ (పురుషుల 70 కేజీల క్వార్టర్ ఫైనల్)
ఆసియా క్రీడల రోయింగ్లో భారత్ చరిత్ర సృష్టించడం వెనక హైదరాబాదీ ఇస్మాయిల్ బైగ్ కీలక పాత్ర ఉంది. సుదీర్ఘ కాలంగా భారత జట్టుకు రోయింగ్ కోచ్గా వ్యవహరిస్తున్న ఇస్మాయిల్.. హాంగ్జౌలో మనవాళ్ల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ‘తీవ్ర పోటీని ఎదుర్కొంటూ మనవాళ్లు ఐదు పతకాలు నెగ్గడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏండ్ల కృషికి దక్కిన ఫలితమిది. ఇప్పుడు సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టొచ్చు. ఒక కోచ్గా నాకెప్పుడూ సంతృప్తి ఉండదు. కనీసం పతకం రంగు మార్చలేకపోయామనే బాధ అయినా ఉంటుంది. చైనా రోవర్లను ఎదుర్కొంటూ పతకాలు గెలువడం చాలా కష్టమని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితమైంది. ఈ ప్రదర్శన ముందు తరాల వాళ్లకు ఆదర్శంగా నిలుస్తుందనుకుం టున్నా. ఇక తదుపరి పారిస్ ఒలింపిక్స్పై దృష్టి పెడతా’ అని ఇస్మాయిల్ వెల్లడించాడు.