కొలంబో: ఆదివారం ఇండియా, శ్రీలంక తొలి వన్డేలో ప్లేయర్స్ కంటే ఎక్కువగా కోచ్ రాహుల్ ద్రవిడ్ ట్విటర్లో ట్రెండ్ అయ్యాడు. ఈ మ్యాచ్లో ధావన్ సేన ఈజీగా గెలవడం ఒక కారణమైతే.. శ్రీలంక ఇన్నింగ్స్ 22వ ఓవర్లో జరిగిన మరో ఘటన ప్రధాన కారణమైంది. కృనాల్ పాండ్యా ఆ ఓవర్ వేశాడు. స్ట్రైక్లో ఉన్న ధనంజయ డిసిల్వా స్ట్రెయిట్గా కొట్టిన షాట్ను కృనాల్ డైవ్ చేస్తూ ఆపబోయిన క్రమంలో.. నాన్స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న చరిత్ అసలంకకు తన కాలు తగిలింది. దీంతో వెంటనే అతడు పైకి లేచి అసలంకను హగ్ చేసుకున్నాడు.
ఈ వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను ఆడే రోజుల్లో ఎంతో హుందాగా, ప్రత్యర్థి ప్లేయర్స్ను కూడా గౌరవించే రాహుల్ ద్రవిడ్ కోచ్గా రావడం వల్లే కృనాల్లాంటి ప్లేయర్స్లోనూ ఇంత మార్పు కనిపిస్తోందంటూ నెటిజన్లు కామెంట్ చేశారు. ది ద్రవిడ్ ఎఫెక్ట్ పేరుతో మిస్టర్ డిపెండబుల్ ట్విటర్లో ట్రెండ్ అయ్యాడు. కొందరైతే రవిశాస్త్రి కోచింగ్లో కృనాల్ ఇలా ఉండేవాడు.. ఇప్పుడు ద్రవిడ్ కోచింగ్లో ఇలా అయ్యాడంటూ ఫొటోలు పెట్టారు. ద్రవిడ్ను శాశ్వతంగా ఇండియన్ టీమ్ కోచ్ను చేస్తే.. యువ ఆటగాళ్లకు ఇలాంటి మంచి లక్షణాలు వస్తాయని మరికొందరు కామెంట్ చేశారు.