హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ హ్యాండ్బాల్ సంఘంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి తెరపడింది. భారత్లో అధికారిక హ్యాండ్బాల్ సంఘం.. హెచ్ఏఐ ఒక్కటే అని అంతర్జాతీయ, ఆసియా సంఘాల గుర్తించినట్లు అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు తెలిపారు. అంతర్జాతీయ సంఘాలన్నీ తమదే అధికారిక హ్యాండ్బాల్ సంఘంగా గుర్తించినట్లు.. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘానికి కూడా వివరించినట్లు జగన్మోహన్ వెల్లడించారు.
ఆదివారం ఫిలింనగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్మోహన్రావు మాట్లాడుతూ.. ‘జాతీయ హ్యాండ్బాల్ సంఘం పేరిట గత కొంతకాలంగా జరుగుతున్న కుట్రలకు తెరపడింది. అధ్యక్షుడిగా ఎన్నికై దాదాపు మూడేండ్లు కావొస్తున్నది. ఈ ప్రయాణంలో హ్యాండ్బాల్ అభివృద్ధికి విప్లవాత్మక సంస్కరణలు చేపట్టాం. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేస్తున్నాం. వారికి హిమాచల్ ప్రదేశ్లోని అకాడమీలో మెరుగైన శిక్షణ అందిస్తున్నాం. దీంతో అంతర్జాతీయ స్థాయిలో మనవాళ్లు రాణిస్తున్నారు. దక్షిణాది వ్యక్తిని అందులోనూ తెలంగాణ వాడిని కావడంతో ఇబ్బందులకు గురిచేశారు.
అయినా ఇప్పుడు సమస్యలన్నీ అధిగమించాం. వైరి సంఘలు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఒక్క తాటిపైకి వచ్చి హెచ్ఏఐతో కలిసి పనిచేయాలని’ అన్నారు. జూన్లో ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ తొలి సీజన్ నిర్వహించనున్నట్లు జగన్ మోహన్ రావు తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా.. అనతికాలంలోనే మంచి ఫలితాలు సాధించామని అయన పేర్కొన్నారు. 2028 ఒలింపిక్స్కు భారత జట్లు అర్హత సాధించడమే తన ముందున్న ఏకైక లక్ష్యమని.. జగన్మోహన్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఐవోఏ, సాయ్ సహకారంతో ఆ దిశగా అడుగులు వేస్తామని పేర్కొన్నారు.