ఆఖరి పోరులోనూ టైటాన్స్ ఓటమి
ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ ప్రస్థానం ముగిసింది. సీజన్ ఆరంభం నుంచి తడబడుతూ వస్తున్న టైటాన్స్ చివరి పోరులోనూ పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో టైటాన్స్ 32-40తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. టైటాన్స్ తరఫున అంకిత్ 10 పాయింట్లు సాధించగా.. పాలమూరు రైడర్ గల్లా రాజు 5 పాయింట్లతో రాణించాడు. ఢిల్లీ తరఫున నీరజ్, అశు, విజయ్ తలా ఆరు పాయింట్లు కొల్లగొట్టారు. లీగ్ దశలో 22 మ్యాచ్లాడిన టైటాన్స్ ఒక్కటంటే ఒక్క విజయం మాత్రమే సాధించి.. 17 మ్యాచ్ల్లో ఓడి 27 పాయింట్లతో పట్టిక అట్టడుగున నిలిచింది. ఇతర మ్యాచ్ల్లో గుజరాత్ జెయింట్స్ 43-33తో తమిళ్ తలైవాస్పై గెలుపొందగా.. బెంగాల్ వారియర్స్ 43-36తో పట్నా పెరెట్స్ను చిత్తు చేసింది. లీగ్లో ఎదురులేకుండా సాగిన పట్నా పైరెట్స్ 81 పాయింట్లతో టాప్లో నిలిచి నాకౌట్ బెర్త్ దక్కించుకోగా.. దబంగ్ ఢిల్లీ (75 పాయింట్లు), యూపీ యోధా (68) కూడా ముందంజ వేశాయి.