హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్లో తెలుగు టాలన్స్ జోరు కొనసాగుతున్నది. జైపూర్ వేదికగా శనివారం జరిగిన లీగ్ మ్యాచ్లో టాలన్స్ 33-22 తేడాతో రాజస్థాన్ పాట్రియాట్స్పై విజయం సాధించింది. లీగ్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లాడిన టాలన్స్.. ఐదో విజయంతో సెమీఫైనల్ బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. టాలన్స్కు ఇది వరుసగా మూడో విజయం కాగా.. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తెలుగు జట్టు అగ్రస్థానంలో నిలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఫుల్ జోష్లో కనిపించిన టాలన్స్ ఏ దశలోనూ రాజస్థాన్ను కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దేవేందర్ సింగ్, నసీబ్ సింగ్, రఘు, అనిల్, రాహుల్, మోహిత్ రాణించడంతో తొలి అర్ధభాగం ముగిసే సరికి టాలన్స్ 14-10తో ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగించిన టాలన్స్ 11 గోల్స్ తేడాతో సీజన్లోనే అత్యంత భారీ విజయం నమోదు చేసుకుంది.