హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఓషియానా ఏషియన్ గేమ్స్లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి పసిడి పతక పోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే 400మీటర్ల విభాగంలో స్వర్ణ పతకంతో మెరిసిన దీప్తి..తాజాగా అదరగొట్టింది. గురువారం జరిగిన మహిళల 200మీటర్ల టీ20 కేటగిరీ రేసును 26.82 సెకన్లలో ముగించిన దీప్తి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నీనా కన్నో(జపాన్, 27.09సె), తెలాయ బ్లాక్స్మిత్(ఆస్ట్రేలియా, 27.70సె) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి అంచలంచెలుగా ఎదిగింది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ మార్గదర్శకత్వంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతున్నది.