తొలి టైటిల్తో కొత్త చరిత్ర.. సీనియర్ నేషనల్ డబుల్ ధమాకా..
షిల్లాంగ్: జాతీయ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్లో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ కొత్త చరిత్ర లిఖించింది. మహిళల సింగిల్స్ విజేతగా గెలిచిన శ్రీజ.. మొదటి సారి జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకుంది. తద్వారా సీనియర్ నేషనల్ టీటీ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన తొలి తెలంగాణ మహిళా ప్యాడ్లర్గా రికార్డు సృష్టించింది. గతం(1964)లో మీర్ ఖాసిమ్అలీ జాతీయ విజేతగా నిలువగా, 58 ఏండ్ల తర్వాత శ్రీజ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ 4-1 (11-8, 11-13, 12-10, 11-8, 11-6)తో మౌమా దాస్పై విజయం సాధించింది.
2019 నార్త్ జోన్ చాంపియన్షిప్లో నేషనల్ ర్యాంకింగ్ టైటిల్ నెగ్గిన శ్రీజ.. ఆ తర్వాత థానేలో జరిగిన టోర్నీలోనూ విజేతగా నిలిచింది. గతేడాది జాతీయ చాంపియన్షిప్లో మనికా బాత్రా చేతిలో ఓటమి పాలైన శ్రీజ.. ఈ సారి పట్టు వదలకుండా ప్రయత్నించి ఫలితం సాధించింది. ‘కల నిజమైనట్లు అనిపిస్తున్నది. చెన్నైలో వారం రోజుల శిక్షణా శిబిరం మంచి ఫలితాన్నిచ్చింది’ అని విజయం అనంతరం శ్రీజ పేర్కొంది. మహిళల డబుల్స్లోనూ శ్రీజ విజేతగా నిలిచింది. ఫైనల్లో శ్రీజ-ఐహిక ముఖర్జీ జంట 3-1 (3-11, 11-9, 11-5, 12-10)తో తెకేమీ సర్కార్-ప్రాప్తి సేన్ ద్వయంపై గెలుపొందింది. పురుషుల సింగిల్స్లో స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ పదో టైటిల్ చేజిక్కించుకున్నాడు. తుదిపోరులో శరత్ 4-3తో సాతియాన్పై విజయం సాధించాడు.
కల నెరవేరింది..
జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో విజేతగా నిలువడం ద్వారా తన కల నెరవేరిందని ఆకుల శ్రీజ సంతోషం వ్యక్తం చేసింది. 58 ఏండ్ల తర్వాత జాతీయ టైటిల్ దక్కించుకున్న తొలి తెలుగు ప్లేయర్గా అరుదైన రికార్డు నెలకొల్పిన శ్రీజ మీడియాతో మాట్లాడింది. ‘జాతీయ టైటిల్ గెలువడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికి నేను నమ్మలేకపోతున్నాను. పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దొరికింది. ఈ చిరస్మరణీయ విజయాన్ని కోచ్ సోమ్నాథ్ ఘోష్తో పాటు ఫిట్నెస్ కోచ్ హిరాక్ బాగ్చీకి అంకితం చేస్తున్నాను. గత పదేండ్ల నుంచి సోమ్నాథ్ సార్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. ఈ అద్భుతమైన సందర్భం కోసం ఇన్ని రోజులు మేము వేచిచూశాం. ప్రతిష్ఠాత్మక బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్కు ముందు ఈ విజయం మరింత ఆత్మవిశ్వాసం కల్గించనుంది. మరికొన్ని అంతర్జాతీయ టోర్నీల్లో ఆడాల్సి ఉంది. ప్రస్తుతం భారత టీటీ జట్టులో ప్లేయర్నైన నేను అంతర్జాతీయ ర్యాంకింగ్స్ను మెరుగుపర్చుకునేందుకు మరింతగా ప్రయత్నిస్తాను’ అని అంది.
మ్యాచ్లు ఎలా సాగాయి?
ఈ టోర్నీలో నేను జాతీయ నంబర్వన్ ప్లేయర్గా బరిలోకి దిగాను. ప్రతీ మ్యాచ్ చాలా క్లిష్టంగా సాగింది. ముఖ్యంగా అయికా ముఖర్జీతో సెమీఫైనల్ మ్యాచ్ హోరాహోరీని తలపించింది. డబుల్స్లో ఐహికతో కలిసి టైటిల్ గెలువడం సంతోషం కల్గించింది. మేమిద్దరం కలిసి ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. ఆమె బెంగాల్లో ఉంటే…నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. కానీ మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగింది. దాంతో డబుల్స్లో టైటిల్ గెలువగలిగాం. ఈ విజయం ఆశ్చర్యం కల్గించకపోయినా..ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
మంత్రి కేటీఆర్కు థ్యాంక్స్
నేను టైటిల్ గెలువడంలో సహకరించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు. దక్షిణమధ్య రైల్వే నుంచి డిప్యూటేషన్ మీద రాష్ట్ర ప్లేయర్లకు శిక్షణ అందించేందుకు కేటీఆర్ సహకరించారు. ఈ సందర్భంగా మంత్రితో పాటు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, అమర్నాథ్రెడ్డి, ప్రకాశ్రాజ్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.