IND vs IRE | గాయం కారణంగా చాన్నాళ్లుగా ఆటకు దూరమైన టీమ్ఇండియా పేస్గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీకి రంగం సిద్ధమైంది. శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకున్న బుమ్రా.. ఐర్లాండ్తో నేడు జరుగనున్న తొలి టీ20లో భారత సారథిగా పునరాగమనం చేయనున్నాడు. వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఇది భాతర జట్టుకు శుభవార్త కాగా.. మెగాటోర్నీకి ఎంపికయ్యే సత్తా ఉందని ఇప్పటికే నిరూపించుకున్న తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మపై అందరి దృష్టి నిలువనుంది!
డబ్లిన్: దాదాపు ఏడాది తర్వాత భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇస్తున్నాడు. గాయం కారణంగా నిరుడు టీ20 ప్రపంచకప్తో పాటు ఎన్నో ప్రధాన మ్యాచ్లకు దూరమైన బుమ్రా.. వన్డే ప్రపంచకప్నకు ముందు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు భారత్, ఐర్లాండ్ మధ్య తొలి టీ20 జరుగనుంది. ప్రధాన ప్లేయర్లందరికీ విశ్రాంతినివ్వడంతో.. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్లో అవకాశం దక్కింది. ఐపీఎల్లో మెరుపులు మెరిపించిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్తో పాటు వెస్టిండీస్ టూర్లో దుమ్మురేపిన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. వెన్నెముక శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న బుమ్రా.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ నిరూపించుకొని తిరిగి జట్టులో చేరగా.. మరో పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా పునరాగమనం చేస్తున్నాడు. మరోవైపు సొంతగడ్డపై టీమ్ఇండియాతో తలపడేందుకు ఐర్లాండ్ తహతహలాడుతున్నది.
అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ జట్టులో హైదరాబాదీ తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలనే వాదనలు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్లో బుమ్రాతో పాటు తిలక్పై అందరి దృష్టి నిలువనుంది. నాలుగో స్థానంలో నిలకడగా రాణించగల సత్తా ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఐర్లాండ్తో సిరీస్లో ఏం చేస్తాడో చూడాలి! యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనుండగా.. వన్డౌన్లో సంజూ శాంసన్కు అవకాశం దక్కొచ్చు. ఆ తర్వాత తిలక్, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్కు రానున్నారు. బుమ్రాతో పాటు ప్రసిద్ధ్కృష్ణ, అర్ష్దీప్ సింగ్ పేస్ భారాన్ని మోయనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రవి బిష్ణోయ్ బరిలోకి దిగొచ్చు. మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది.
ఇన్నాళ్లు ఆటకు దూరంగా ఉండటం చాలా కష్టంగా అనిపించింది. కెరీర్లో ఇంత సుదీర్ఘ కాలం మైదానం బయట ఎప్పుడూ కూర్చోలేదు. నేను టీ20ల కోసమేం సిద్ధం కాలేదు. వన్డే ప్రపంచకప్లో ఆడాలనే లక్ష్యంతోనే కఠోర సాధన చేసి తిరిగి జట్టులోకి వచ్చా. సునాయాసంగా 10, 12 ఓవర్లు బౌలింగ్ చేయగలనని నమ్ముతున్నా. గాయం నుంచి తిరిగి కోలుకొని అంతర్జాతీయ స్థాయిలో రాణించడం చిన్న విషయమేం కాదు. ఆటను ఆస్వాదించడం నాకు ఇష్టం. ఎన్సీఏలో అదే చేశా. మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా బరిలోకి దిగనున్నా. ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.
-జస్ప్రీత్ బుమ్రా, భారత కెప్టెన్
భారత క్రికెట్ జట్టు ప్రపంచంలో ఏ మూలన మ్యాచ్ ఆడేందుకు మైదానంలో అడుగుపెట్టినా.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తడం సహజం. సీనియర్ ఆటగాళ్లు లేకుండా జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియా నేటి నుంచి ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. సుమారు 12 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న మల్హెడె క్రికెట్ క్లబ్లో భారత్, ఐర్లాండ్ జట్లు తలపడనున్నాయి. టీమ్ఇండియా వంటి పటిష్టమైన జట్టుతో ఆడటం వల్ల తమ ప్లేయర్ల ఆట మెరుగవడంతో పాటు.. ఆర్థికంగానూ ఎంతో లబ్ది చేకూరుతుందని ఐర్లాండ్ బోర్డు భావిస్తున్నది.
టీ20ల్లో భారత జట్టుకు బుమ్రా 11వ కెప్టెన్ కానున్నాడు. ఈ ఫార్మాట్లో దక్షిణాఫ్రికా (15), వెస్టిండీస్ (13) టీమ్ఇండియా కంటే ఎక్కువ మంది సారథులను మార్చింది.