టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ ముందు వరకు ఫామ్లేమితో ఇబ్బంది పడ్డ గిల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టెక్నిక్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న గిల్..అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యాడు. వైజాగ్ టెస్టులో సెంచరీతో టచ్లోకి వచ్చిన గిల్ రాజ్కోట్ పోరులో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా తనపై నెలకొన్న ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేశాడు. శుక్రవారం నుంచి రాంచీ వేదికగా ఇంగ్లండ్తో నాలుగో టెస్టు నేపథ్యంలో గిల్ మీడియాతో మాట్లాడాడు.
Shubman Gill | రాంచీ: భారత యువ క్రికెటర్ శుభ్మన్ గిల్..తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోలేకపోయానని అన్నాడు. ఇది ఒకింత నిరాశ కల్గించిందని చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్టు మ్యాచ్ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిల్ పలు అంశాలపై మాట్లాడాడు. ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో మొదట్లో ఘోరంగా విఫలమైన గిల్..విశాఖపట్నం, రాజ్కోట్ టెస్టుల ద్వారా తన సత్తాచాటాడు. హైదరాబాద్ టెస్టులో నిరాశపరిచిన ఈ పంజాబ్ క్రికెటర్..విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో ధనాధన్ సెంచరీతో తనపై వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాడు.
అప్పటి వరకు ఇంటాబయటా ఒత్తిడి ఎదుర్కొన్న గిల్..సెంచరీతో గాడిలో పడ్డాడు. అదే దూకుడు రాజ్కోట్ టెస్టులోనూ ప్రదర్శిస్తూ రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కెరీర్ తొలి రోజుల్లో ఓపెనర్గా వ్యవహరించిన గిల్..అటు తర్వాత మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఇన్ని రోజులు మూడో నంబర్లోవచ్చిన విరాట్ కోహ్లీని నాలుగుకు పరిమితం చేస్తూ గిల్ ప్రమోషన్ పొందాడు. ఇంగ్లండ్తో ముగిసిన మూడు టెస్టుల్లో 42 సగటుతో 252 పరుగులతో కొనసాగుతున్నాడు.
ఇన్నింగ్స్కు ఇరుసులా భావించే మూడో నంబర్లో బ్యాటింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. ఇన్ని రోజులు ఓపెనర్గా దిగినప్పుడు ఎలాంటి సమస్య ఎదుర్కొలేదు. ఎందుకంటే ఆలోచన లేకుండా బ్యాటింగ్కు వచ్చేవాడిని. అయితే టెస్టుల్లో మూడో నంబర్ అనేది చాలా కీలకం. దేశవాళీ క్రికెట్లో మూడులో బ్యాటింగ్ చేసిన అనుభవముంది. కానీ అంతర్జాతీయ స్థాయిలో ఇది నాకు కొత్త. ఆదిలోనే వికెట్లు పడిపోతే ఇన్నింగ్స్ను చక్కదిద్దడం. లేకపోతే పరిస్థితులు తగ్గట్లు బ్యాటింగ్ తీరు మార్చుకోవాల్సి వస్తుంది. వెంటవెంటనే వికెట్లు పడితే ఇన్నింగ్స్ను నిర్మించాల్సి ఉంటుంది. వైజాగ్, రాజ్కోట్ టెస్టులే ఇందుకు నిదర్శనం. మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలిచి ప్రత్యర్థిపై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నిస్తాను. దీనిపై టీమ్ డ్రెస్సింగ్ రూమ్లో చర్చ జరుగుతుంది.
మామూలుగా స్వదేశంలో టెస్టు సిరీస్ అంటే స్పిన్నర్లదే ఎక్కువ ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో స్పిన్నర్ల కంటే పేసర్లు తమ హవా ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా యార్కర్ స్పెషలిస్టు బుమ్రా కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్నా డు. వైజాగ్ టెస్టులో రివర్స్ స్వింగ్తో ఇంగ్లండ్ బ్యాటర్ల నడ్డివిరిచాడు. స్పిన్ పిచ్లపై రివర్స్ స్వింగ్ రాబడుతూ ఇంగ్లండ్ను దెబ్బతీయడంలో కీలకమయ్యాడు. నలుగురు స్పిన్నర్లు కలిసి 36 వికెట్లు తీస్తే..పేసర్లు 22 వికెట్లు పడగొట్టారు. పేసర్ల అద్భుత ప్రదర్శనకు ఇదే నిదర్శనం.
సాధారణంగా టెస్టుల్లో అశ్విన్, జడేజా పోటీపడి వికెట్లు తీస్తారు. ఈసారి బుమ్రా, సిరాజ్ వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. రాంచీ టెస్టుకు బుమ్రా లేకపోయినా..ఆ స్థానాన్ని సిరాజ్ భర్తీ చేయగలడు. ముకేశ్కుమార్, అక్ష్దీప్ ముందుకు నడిపించగలరు. సీనియర్ క్రికెటర్లు కోహ్లీ, రాహుల్, షమీ గైర్హాజరీలో యువ క్రికెటర్లు సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశం. అద్భుత ప్రతిభ వల్లే యశస్వి జైస్వాల్ వరుసగా రెండు టెస్టుల్లో డబుల్ సెంచరీలతో విజృంభించాడు. రానున్న మ్యాచ్ల్లో ఇదే జోరు కొనసాగిస్తాడన్న నమ్మకం నాకుందని గిల్ అన్నాడు.