న్యూఢిల్లీ: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ స్టువర్ట్ బిన్నీ( Stuart Binny ) అంతర్జాతీయ, ఫస్ట్క్లాస్ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇండియన్ టీమ్ తరఫున 2014-16 మధ్య స్టువర్ట్ బిన్నీ 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 37 ఏళ్ల స్టువర్ట్ బిన్నీ ఈ సందర్భంగా బీసీసీఐతోపాటు తన దేశవాళీ టీమ్ కర్ణాటకకు కూడా కృతజ్ఞతలు తెలిపాడు. 1983లో క్రికెట్ వరల్డ్కప్ గెలిచిన టీమ్లో సభ్యుడైన రోజర్ బిన్నీ కుమారుడే ఈ స్టువర్ట్ బిన్నీ. ఫస్ట్క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవ్వాలని నిర్ణయించుకున్నాను అని ఆ ప్రకటనలో స్టువర్ట్ బిన్నీ చెప్పాడు. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఎంతో సంతోషంగా ఉన్నదని అన్నాడు.
ఆ ఒక్క మ్యాచ్తో..
టెస్టుల్లో 194 పరుగులు మూడు వికెట్లు తీసిన అతడు.. వన్డేల్లో 230 పరుగులు, 20 వికెట్లు.. టీ20ల్లో 24 పరుగులు చేసి ఒక వికెట్ తీశాడు. ఇండియా తరఫున స్టువర్ట్ బిన్నీకి ఓ మరుపురాని మ్యాచ్ ఉంది. 2014లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బిన్నీ లెజెండరీ బౌలర్ అనిల్ కుంబ్లే రికార్డును తిరగరాశాడు. ఆ మ్యాచ్లో 4.4 ఓవర్లు వేసిన అతడు.. కేవలం 4 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఇండియా తరఫున వన్డేల్లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం.