హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలకు వేళయైంది. గత సెప్టెంబర్తో పాలకవర్గ సభ్యుల గడువు ముగియగా..హెచ్సీఏ పాలన కుంటుపడింది. ఎన్నడూలేని రీతిలో అవినీతి వ్యవహారాలు పతాకస్థాయికి చేరుకోగా సభ్యుల మధ్య బేధాభ్రియాలు రచ్చకెక్కాయి. హెచ్సీఏ వ్యవహారం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది.
హైకోర్టు తీర్పుపై కొన్ని క్లబ్లు సుప్రీంను ఆశ్రయించగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర్రావు నేతృత్వంలో ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇంతకుముందు ఉన్న సూపర్వైజరీ కమిటీని రద్దు చేస్తూ హెచ్సీఏ ఎన్నికల పర్యవేక్షకుడిగా నియమిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కారణంగా త్వరలో హెచ్సీఏకు ఎన్నికలు జరుగబోతున్నాయి.
న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నెలకొన్న ప్రతిష్ఠంభనకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు పాలకవర్గ సభ్యుల పదవీకాలం గత సెప్టెంబర్ ఆఖరితో ముగిసినా.. పదవుల్లో కొనసాగుతూ అవినీతికి అర్రులు చాచడం హెచ్సీఏ ప్రతిష్ఠను మంటగలిపింది. అంబుడ్స్మన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్వర్మ నియామకంపై తెలంగాణ హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ కొన్ని క్రికెట్ క్లబ్లు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సంజయ్ కిషన్ కౌల్, మనోజ్ మిశ్రా, అరవింద్ కుమార్తో కూడిన ధర్మాసనం హెచ్సీఏలో నెలకొన్న ప్రతిష్ఠంభను తొలిగించే రీతిలో ఎన్నికలు నిర్వహించాలంటూ తీర్పు ఇచ్చింది. ఇందుకుగాను సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర్రావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. దీనికి తోడు హెచ్సీఏ ఎన్నికల పర్యవేక్షకుడిగాను ప్రకటించింది. ఆయనకు అన్ని విధాలుగా సహకరించాలంటూ హెచ్సీఏకు ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై బెంచ్ సభ్యులు మాట్లాడుతూ ‘హెచ్సీఏలో ప్రస్తుతమున్న గందరగోళ పరిస్థితులకు వీలైనంత తొందరలో తెరపడాలి. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరగాలి. సుదీర్ఘ అనుభవమున్న హైదరాబాద్ వాసి అయిన రిటైర్డ్ సుప్రీం రిటైర్డ్ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వర్రావు పూర్తి న్యాయం చేయగలరని భావించాం. అందుకే ఆయన్ను ఏకైక సభ్యుడిగా కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు ఎన్నికలకు పర్యవేక్షకుడిగా నియమించాం. ఆయనకు అన్ని విధాలుగా హెచ్సీఏ సహకరించాలి. పూర్తి ఖర్చులు అసోసియేషన్ భరించాలి. కోర్టు నుంచి ఇతరత్రా ఆదేశాలు ఆవసరమైతే ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకురావచ్చు’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే వీలైనంత తొందరగా హెచ్సీఏకు ఎన్నికలు జరపాలని సుప్రీం కోర్టు బెంచ్ సూచించింది. ఈ కేసు విషయంలో వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ సిద్దార్థ దవే.. రిటైర్డ్ జడ్జి జస్టిస్ నాగేశ్వర్రావు పేరును ప్రతిపాదించారు. తీర్పు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సుదీర్ఘ అనుభవమున్న నాగేశ్వర్రావు నేతృత్వంలో హెచ్సీఏకు ఎన్నికలు జరిగేందుకు మేము ప్రతిపాదన చేశాం. హైదరాబాద్కు చెందిన ఆయన ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేస్తారు’ అని దవే అన్నారు.
ఇటీవల జరిగిన భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) ఎన్నికల నిర్వహణలోనూ రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వర్రావు కీలకంగా వ్యవహరించారు. ఎలక్టోరల్ కాలేజీకి తుది రూపునిస్తూ ఎన్నికల ప్రక్రియను సమర్థంగా నిర్వహించారు. ఐవోఏ తీసుకొస్తున్న కొత్త రాజ్యాంగానికి తుదిరూపునివ్వడంలో ఆయన తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించి ప్రతిష్ఠంభనకు ఆయన ఫుల్స్టాప్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హెచ్సీఏ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ నేతృత్వంలో ఏర్పాటైన సూపర్వైజరీ కమిటీని సుప్రీం కోర్టు తాజాగా రద్దు చేసింది. కమిటీ ఇక మనుగడలో కొనసాగదని సీనియర్ అడ్వకేట్ జయంత్ భూషణ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జస్టిస్ కక్రూతో పాటు అంజనీకుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్తో కూడిన సూపర్వైజరీ కమిటీ రద్దు అయ్యింది. మరోవైపు అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్, కార్యదర్శి విజయానంద్ వద్ద ఉన్న చెక్పవర్, సైనింగ్ పవర్ను జస్టిస్ నాగేశ్వర్రావుకు బదిలీ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.