పకడ్బందీ వ్యూహానికి పక్కా ప్రణాళిక తోడైతే!
అనుభవసారానికి యువ రక్తం మేళవిస్తే!
తెలివికి తెగువ జోడైతే!
ఇవన్నీ ఏక కాలంలో జరిగితే ఎలా ఉంటుందో.. చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది!! గతేడాది పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ధోనీ సేన.. ఏడాది తిరిగేసరికి ఉత్తుంగ తరంగంలా ఎగిసి టైటిల్ ముద్దాడింది. ఫామ్తో సంబంధం లేకుండా.. ఆటగాళ్ల సత్తాపైనే నమ్మకముంచిన మహీ మరోసారి మ్యాజిక్ చేయగా.. యూఏఈలో అడుగుపెట్టాక అద్భుతమైన ఆటతీరుతో వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్కు అర్హత సాధించిన కోల్కతా నైట్ రైడర్స్ తుదిమెట్టుపై తడబడింది. పొట్టి ఫార్మాట్లో 300వ మ్యాచ్కు నాయకత్వం వహించిన మహేంద్రుడు నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ ఖాతాలో వేసుకుంటే.. మూడోసారి ఫైనల్ చేరిన కోల్కతా రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది!
దుబాయ్: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ముద్రపడ్డ చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి విశ్వరూపం చూపింది. వయసైపోయిందన్న వాళ్ల నోళ్లూ మూయిస్తూ.. సత్తా తగ్గిందన్న విమర్శకులకు దీటైన జవాబిస్తూ చెన్నై సింహాలు జూలు విదిల్చాయి. ఫలితంగా ధోనీ సేన నాలుగోసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఐపీఎల్ 14వ సీజన్ ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ 27 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. లీగ్లో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో తొమ్మిదోసారి ఫైనల్ చేరిన ధోనీ గ్యాంగ్.. ఏక పక్ష పోరులో కోల్కతాను రఫ్ఫాడించింది. ప్రపంచంలో మరే సారథికి సాధ్యం కాని రీతిలో పొట్టి ఫార్మాట్లో 300వ మ్యాచ్ ఆడిన ధోనీ.. మైలురాయి పోరులో అద్భుత విజయాన్నందుకున్నాడు. విజయ దశమి రోజు జరిగిన ఫైనల్ ఫైట్లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (59 బంతుల్లో 86; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. రుతురాజ్ గైక్వాడ్ (32; 3 ఫోర్లు, ఒక సిక్సర్), రాబిన్ ఉతప్ప (31; 3 సిక్సర్లు), మోయిన్ అలీ (37 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అతడికి సహకరించారు. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో కోల్కతా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులకే పరిమితమైంది. యువ ఓపెనర్లు శుభ్మన్ గిల్ (51; 6 ఫోర్లు), వెంకటేశ్ అయ్యర్ (50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత ఆరంభాన్నిచ్చినా.. నితీశ్ రాణా (0), సునీల్ నరైన్ (2), ఇయాన్ మోర్గాన్ (4), దినేశ్ కార్తీక్ (9), షకీబ్ అల్ హసన్ (0) రాహుల్ త్రిపాఠి (2) పెవిలియన్కు క్యూ కట్టడంతో కోల్కతాకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, రవీంద్ర జడేజా, హజిల్వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. చెన్నైకి భారీ స్కోరు అందించిన డుప్లెసిస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు చేజిక్కించుకున్నాడు.
చెన్నై: 20 ఓవర్లలో 192/3 (డుప్లెసిస్ 86, మోయిన్ అలీ 37 నాటౌట్; నరైన్ 2/26), కోల్కతా: 20 ఓవర్లలో 165/9 (గిల్ 51, వెంకటేశ్ 50; శార్దూల్ 3/38, హజిల్వుడ్ 2/29).