ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఓటముల పరంపర కొనసాగుతున్నది. సమిష్టి వైఫల్యంతో సొంత ఇలాఖాలో కూడా విజయాన్ని అందుకోలేకపోయింది. సోమవారం ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఢిల్లీ చేతిలో రైజర్స్ ఓటమి ఎదుర్కొంది. సుందర్, భువీ బౌలింగ్తో స్వల్ప స్కోరుకే ఢిల్లీని పరిమితం చేసిన రైజర్స్ బ్యాటింగ్లో విఫలమైంది. మయాంక్ అగర్వాల్ మినహా అందరూ చేతులేత్తెయడంతో వరుసగా మూడో ఓటమిని ఖాతాలో వేసుకుంది. రెండో విజయంతో ఢిల్లీ ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఏదీ కలిసి రావడం లేదు. సొంత ఇలాఖాలోనూ చేదు అనుభవమే ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్లో రైజర్స్ ఏడు పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓటమి పాలైంది. తొలుత ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 144-9 స్కోరు చేసింది. అక్షర్పటేల్ (34), మనీశ్పాండే(34) రాణించారు. సుందర్ (3-28) మూడు వికెట్లు తీశాడు. లక్ష్యఛేదనలో హైదరాబాద్ 20 ఓవర్లలో 137-6 స్కోరుకు పరిమితమైంది. మయాంక్ అగర్వాల్ (49) టాప్స్కోరర్గా నిలువగా, క్లాసెన్ (31), సుందర్ (24 నాటౌట్) ఆకట్టుకున్నారు. నోకియా (2-33), అక్షర్పటేల్ (2-21) రాణించారు. అక్షర్ పటేల్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
నిర్దేశిత లక్ష్యఛేదనలో హైదరాబాద్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. మెరుగైన శుభారంభం అందిస్తాడనుకున్న ఓపెనర్ హ్యారీ బ్రూక్(7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అప్పటి వరకు ఆచితూచి ఆడిన బ్రూక్..నోకియా వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. దీంతో 31 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన రైజర్స్ పవర్ప్లే ముగిసే సరికి 36 పరుగులకు పరిమితమైంది. సొంతగడ్డపై సత్తాచాటాల్సింది పోయి, ప్రత్యర్థి బౌలర్లకు రైజర్స్ బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. చేధించాల్సింది భారీ లక్ష్యం కాకపోయినా ఒత్తిడికి చిత్తయిన రైజర్స్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకున్నారు. ఇదే అదనుగా అంతకంతకు హైదరాబాద్పై ఢిల్లీ పట్టుబిగుస్తూ పోయింది. దీంతో ఓవర్కో వికెట్ చొప్పున మయాంక్ అగర్వాల్(49), రాహుల్ త్రిపాఠి(15), అభిషేక్శర్మ(5), కెప్టెన్ మార్క్మ్(్ర3) ఘోరంగా నిరాశపరిచారు. అయితే ఆఖర్లో క్లాసెన్(27 నాటౌట్), సుందర్(15 నాటౌట్) జట్టును గట్టెక్కించారు. 85 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును వీరిద్దరు ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరు ఆరో వికెట్కు 41 పరుగులు జోడించారు. అయితే 19వ ఓవర్లో క్లాసెన్ ఔట్ కావడం రైజర్స్ గెలుపు అవకాశాలపై నీళ్లు చల్లింది. ఆఖరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరమైన దశలో సుందర్, జాన్సెన్ జట్టును గెలిపించలేకపోయారు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ మూడో బంతికే ఢిల్లీ ఓపెనర్ ఫిల్ సాల్ట్(0) డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో ఒక పరుగుకే ఢిల్లీ మొదటి వికెట్ చేజార్చుకుంది. ఆ తర్వాత మిచెల్ మార్ష్(25) వచ్చి రావడంతోనే హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. జాన్సెన్ను లక్ష్యంగా చేసుకుంటూ నాలుగు ఫోర్లు కొట్టడంతో స్కోరుబోర్డుకు 19 పరుగులు జతకలిశాయి. పిచ్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ భువీ స్వింగ్ రాబట్టడంతో పరుగుల రాక ఒక రకంగా మందగించింది. జాన్సెన్ స్థానంలో బౌలింగ్ మార్పుగా వచ్చిన వాషింగ్టన్ సుందర్ను వార్నర్ ఒక సిక్స్, ఫోర్తో అరుసుకున్నాడు. అయితే ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకుంటున్న తరుణంలో నటరాజన్ ఢిల్లీని దెబ్బ తీశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ రెండో బంతికి మార్ష్ను నటరాజన్ పెవిలియన్ పంపాడు. ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీఆర్ఎస్కు వెళ్లిన సన్రైజర్స్కు అనుకూల ఫలితం దక్కింది. ఇలా పవర్ప్లే ముగిసే సరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. మరోమారు బౌలింగ్ మార్పుగా వచ్చిన సుందర్..ఢిల్లీని కోలుకోలేని రీతిలో దెబ్బ తీశాడు. తాను వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో వార్నర్, సర్ఫరాజ్ఖాన్(10),అమన్ హకీంఖాన్(4) వెంటవెంటనే ఔట్ అయ్యారు. సుందర్ బంతిని స్వీప్ ఆడటానికి ప్రయత్నించిన వార్నర్..డీప్స్కేర్ లెగ్లో బ్రూక్ క్యాచ్తో నిష్క్రమించాడు. బంతి తేడాతో సర్ఫరాజ్ ఖాన్..వార్నర్ను అనుసరించాడు. స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో సర్ఫరాజ్.. భువనేశ్వర్ క్యాచ్తో పెవిలియన్కు భారంగా వెళ్లాడు. వస్తూనే బౌండరీతో దూకుడు మీద కనిపించిన హకీంఖాన్ మరోమారు తీవ్రంగా నిరాశపరిచాడు. భారీ షాట్ ఆడే క్రమంలో బంతి బ్యాటు ఎడ్జ్ తీసుకోవడంతో హకీంఖాన్ ఐదో వికెట్గా వెనుదిరిగాడు. దీంతో క్యాపిటల్స్ 62 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. గత మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపని సుందర్ ఈ మ్యాచ్లో కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపానే మార్చేశాడు.
ఓవైపు సహచరులు స్వల్ప స్కోర్లకే నిష్క్రమించినా..ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా దక్కిందంటే అది మనీశ్పాండే(34), అక్షర్ పటేల్(34) ఆడటం వల్లే సాధ్యమైంది. పది ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ ఐదు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓవైపు మంచి బంతులను గౌరవిస్తూనే..చెత్త బంతులను బౌండరీలకు తరలించే ప్రయత్నం చేశారు. ఇన్నింగ్స్ గేర్ మార్చే ప్రయత్నంలో భువీ బౌలింగ్లో అక్షర్ క్లీన్బౌల్డ్ కావడంతో ఆరో వికెట్కు 69 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఇక్కణ్నుంచి ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రిపాల్ పటేల్(5), నోకియా(2), కుల్దీప్ యాదవ్(4 నాటౌట్), ఇషాంత్శర్మ(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. తన నాలుగు ఓవర్ల కోటాలో 11 పరుగులే ఇచ్చుకున్న భువీ రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఢిల్లీ: 20 ఓవర్లలో 144-9(పాండే 34, అక్షర్ 34, సుందర్ 3-28, భువనేశ్వర్ 2-11), హైదరాబాద్: 20 ఓవర్లలో 137-6(మయాంక్ 49, క్లాసెన్ 31, అక్షర్ పటేల్ 2-21, నోకియా 2-33)