Sulakshan Kulkarni : పొట్టి క్రికెట్లో నంబర్ 1 ఆటగాడు సూర్యకుమార్ యాదవ్పై ముంబై మాజీ కోచ్ సులక్షణ్ కులకర్ణి ప్రశంసలు కురిపించాడు. అతడిని మొదటిసారి చూసినప్పుడు తనకు లెజెండరీ క్రికెటరల్ కపిల్ దేవ్ గుర్తుకు వచ్చాడని అన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను 2011లో ముంబై జట్టకు కోచ్ అయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ గురించి మొదటిసారి దిలీప్ వెంగ్సర్కార్ నాకు చెప్పాడు. దాంతో, అతనికి తన సహజమైన ఆట ఆడేందుకు స్వేఛ్చ ఇచ్చాను. ఎందుకంటే.. సూర్యలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ లక్షణాలను గమనించాను. కపిల్ ఫామ్లో ఉన్నప్పుడు అతడికి సరితూగే ఆటగాడు మరొకరు ఉండరు. సూర్య కూడా అచ్చం కపిల్ లాగనే అటాకింగ్ గేమ్ ఆడతాడు. ప్రతి టీమ్లో స్వేచ్ఛగా ఆడి, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల ప్లేయర్ ఒకరు ఉండాలి. నా వరకు ముంబై జట్టులో సూర్య అలాంటి ఆటగాడే’ అని ఈ మాజీ కోచ్ వెల్లడించాడు.
మేనేజ్మెంట్కు ఏం చెప్పానంటే..?
ముంబై జట్టు కోచ్గా బాధ్యతలు స్వీకరించాక కులకర్ణి చేసిన మొదటి పని ఎంటో తెలుసా..? టీమ్ మేనేజ్మెంట్కు సూర్య గురించి చెప్పడమే. ‘సూర్య మొదట్లో దాదర్ యూనియన్ స్పోర్ట్స్ క్లబ్కు ఆడేవాడు. అయితే.. నేను అతడిని ముంబై అండర్-22 జట్టుకు ఆడుతుండగా మొదటిసారి చూశా. కోచ్ అయ్యాక టీమ్ మేనేజ్మెంట్కు చెప్పిన మొదటి విషయం ఏంటంటే..? సూర్య కుమార్కు స్వేఛ్చనివ్వాలని. సూర్య తనకు నచ్చినట్టు ఆడతాడు. అతడికి ఎవరూ అడ్డు చెప్పకూడదు అని వాళ్లకు చెప్పాను’ అని కులకర్ణి ఒకప్పటి రోజులను గుర్తు చేసుకున్నాడు.
మూడు శతకాలు
కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు 1983లో విశ్వ విజేతగా నిలిచింది. లార్డ్స్లో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్ను ఓడించి మొదటిసారి వన్డే ప్రపంచకప్ అందుకుంది. ఆలస్యంగా భారత జట్టుకు ఎంపికైన సూర్య టీ20ల్లో తనదైన ముద్ర వేశాడు. విధ్యంసక ఇన్నింగ్స్లతో నంబర్ 1 ర్యాంక్కు ఎగబాకాడు. అంతేకాదు ఈ ఫార్మాట్లో బౌలర్లకు కొరకరాని కొయ్యాగా తయారైన ఇతను ఇప్పటికే మూడు శతకాలు బాదాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో సూర్య టెస్టుల్లో ఆరంగ్రేటం చేసే అవకాశం ఉంది. ఈ స్టార్ ప్లేయర్ను తొలి రెండు టెస్టులకు బీసీసీఐ ఎంపికచేసింది.