హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ వేదికగా 37వ జాతీయ బాలుర సబ్జూనియర్ హ్యాండ్బాల్ చాంపియన్షిప్ అట్టహాసంగా మొదలైంది. కరోనా వైరస్ విజృంభణ తర్వాత నగరంలో జరుగుతున్న తొలి టోర్నీని రాష్ట్ర ప్రభుత్వం, సాట్స్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య గురువారం సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో పోటీలకు తెరలేచింది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై చాంపియన్షిప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు ఇలాంటి టోర్నీల నిర్వహణకు క్రీడా సంఘాలు ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయి. హైదరాబాద్ను త్వరలోనే స్పోర్ట్స్ హబ్గా మారుస్తాం’ అని అన్నారు. మరోవైపు జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకముంచి వివిధ రాష్ర్టాల నుంచి ప్లేయర్లను పంపినందుకు ఆయా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే వివిధ కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఐవోఏ కోశాధికారి ఆనందీశ్వర్ పాండే, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పవన్, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.