జకార్తా: ఇండోనేషియా ఓపెన్లో భారత షట్లర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఇప్పటికే స్టార్ షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్ ఆదిలోనే తమ పోరాటాన్ని ముగించగా, శ్రీకాంత్, లక్ష్యసేన్ అదే బాటలో పయనించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో శ్రీకాంత్ 21-23, 10-21 తేడాతో బ్రైస్ లెవర్డెజ్(ఫ్రాన్స్) చేతిలో అనూహ్య ఓటమి ఎదుర్కొన్నాడు. 42 నిమిషాల్లోనే ముగిసిన పోరులో శ్రీకాంత్ స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చడంలో విఫలమై మూల్యం చెల్లించుకున్నాడు.
ఇద్దరు ఆరు సార్లు పోటీపడగా, బ్రైస్ చేతిలో శ్రీకాంత్ తొలిసారి ఓటమి ఎదుర్కొన్నాడు. మరో సింగిల్స్లో ఎనిమిదో సీడ్ లక్ష్యసేన్ 10-21, 9-21తో హెచ్ఎస్ ప్రణయ్ చేతిలో ఘోర పరాజయం చవిచూశాడు. పురుషుల డబుల్స్లో ఎమ్ఆర్ అర్జున్, ధృవ్ కపిల జోడీ 27-25, 18-21, 21-19తో జపాన్ ద్వయం మత్సు, యోషినోరిపై గెలిచి ముందంజ వేసింది. మహిళల డబుల్స్లో అశ్విని భట్, శిఖా గౌతమ్ జోడీతో పాటు హరిత హరినారాయణన్, అశ్న రాయ్ ద్వయం పరాజయం చవిచూశాయి.