వచ్చే ఏడాది జనవరి నుంచి దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ (CSA T20) లో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్.. కొత్త జట్టుకు పేరు పెట్టింది. సఫారీ టీ20లీగ్లో పోర్ట్ ఎలిజిబెత్ ఫ్రాంచైజీని దక్కించుకున్న ఎస్ఆర్హెచ్.. ఆ జట్టుకు ‘సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్’ (Sunrisers Eastern Cape)గా పేరు ఖరారు చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
మినీ ఐపీఎల్గా భావిస్తున్న సీఎస్ఏ టీ20 లీగ్ లో ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లే దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఎస్ఆర్హెచ్ కూడా పోర్ట్ ఎలిజిబెత్లో పెట్టుబడులు పెట్టింది. ఇక Sunrisers Eastern Cape పేరుతో పాటు ఆ జట్టుకు ఆడబోయే ఇద్దరు ఆటగాళ్ల పేర్లను కూడా ఎస్ఆర్హెచ్ ప్రకటించింది.
ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున ఆడుతున్న ఎయిడెన్ మార్క్రమ్ను ఈస్టర్న్ కేప్లో సభ్యుడిగా తీసుకుంది. మార్క్రమ్తో పాటు సఫారీ బౌలింగ్ సంచలనం ఒట్నీల్ బార్టమన్ను దక్కించుకుంది. బార్టమన్ ఇంకా దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం (అన్క్యాప్డ్) చేయలేదు.
మార్క్రమ్.. ఐపీఎల్-15లో సన్ రైజర్స్ తరఫున 14 మ్యాచ్లలో 381 పరుగులు చేశాడు. ఇక బార్టమన్.. డెత్ ఓవర్లలో స్పెషలిస్టు బౌలర్గా ఎదుగుతున్నాడు. ఇప్పటివరకు వివిధ లీగ్ లలో 35 టీ20లు ఆడిన అతడు.. 41 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరి తర్వాత మిగిలినవారి పేర్లను కూడా ఎస్ఆర్హెచ్ త్వరలోనే ప్రకటించే అవకాశముంది.