భౌతిక దూరం, శానిటైజేషన్ కూడా తప్పనిసరి
60 ఏండ్లు, దీర్ఘకాలిక రోగులకు కొనసాగుతున్న కార్యక్రమం
మార్చిలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2,346 పాజిటివ్ కేసులు
నేటి నుంచి 45 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్
ఉమ్మడి జిల్లాలో 84 కేంద్రాల్లో టీకా వేసేందుకు ఏర్పాట్లు
మంచిర్యాలలో 30, ఆసిఫాబాద్లో 15 కేంద్రాల ఏర్పాటు
మంచిర్యాల జిల్లాలో ముగ్గురికి వెయ్యి చొప్పున జరిమానా
కరోనా మహమ్మారి పంజా విసురుతున్నది. తగ్గినట్టే తగ్గి మళ్లీ ప్రభావం చూపుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మార్చిలోనే 2,346 పాజిటివ్ కేసులు వచ్చాయి. రాష్ట్ర సర్కారు అధికారులను అప్రమత్తం చేసి అవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నది. ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్లైన్ వారియర్స్, 45-59 సంవత్సరాలు ఉండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న 52,461 మందికి టీకాలు కూడా వేసింది. నేటి(గురువారం) నుంచి 45 ఏండ్లు దాటిన వారికి టీకాలు వేయడానికి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 84 కేంద్రాలు ఏర్పాటు చేసింది. మంచిర్యాలలో 30, ఆసిఫాబాద్లో 15 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు కూడా విధించాయి. మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నాయి. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, టీకా కూడా వేయించుకోవాలని కోరుతున్నాయి.
మంచిర్యాల , మార్చి 31(నమస్తే తెలంగాణ) : విశ్వమారి కరోనా వెలుగు చూసి ఏడాది దాటినా దాని ప్రభావం తగ్గడం లేదు. రోజురోజుకూ విజృంభిస్తూనే ఉన్నది. కట్టడికి సర్కారు చర్యలు తీసుకుంటున్నా.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మాస్కులు తప్పనిసరి ధరించాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజేషన్ చేసుకోవాలని సూచించడంతో కొంత మేర తగ్గినా.. మళ్లీ మార్చిలో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సర్కా రు కూడా టీకాలు అందిస్తున్నది. ఇప్పటివరకు హెల్త్ కేర్ వర్కర్లు మొదలుకొని, ఫ్రంట్లైన్ వారియర్స్, 45-59 సంవత్సరాలు ఉండి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి టీకాలు ఇచ్చా రు. ఇప్పటివరకు దాదాపు 52,461 మందికి టీకా వేశారు. నేటి (గురువారం) నుంచి 45 ఏం డ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకాను అందించేందుకు చర్యలు చేపట్టగా, అధికారులు ఏర్పాట్లు చేశారు.
మార్చిలో 233 పాజిటివ్ కేసులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మార్చి నెలలో 2,346 పాటిజివ్ కేసులు నమోదు కాగా 56 మరణాలు సంభవించాయి. గతేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టే పట్టి మళ్లీ విజృంభిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో 46,162 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,346 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 114, నిర్మల్లో 691, ఆదిలాబాద్లో 862, మంచిర్యాలలో 679 మందికి మార్చి లో పాజిటివ్ వచ్చింది. ఆదిలాబాద్లో 4, మంచిర్యాల జిల్లాలో 52 మరణాలు సంభవించాయి.
నేటి నుంచి విస్తృతంగా టీకాలు..
నేటి(గురువారం) నుంచి వ్యాక్సినేషన్ను విస్తృతం చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా వేయాలని అధికారులను ఆదేశించాయి. 45 ఏండ్లు దాటిన వారు ముందుగా కొవిన్ యాప్లో తమ పేరు నమోదు చేసుకోవాలని, లేదంటే రోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాలకు ఆధార్, ఓటరు, పాన్ తదితర వ్యక్తిగత గుర్తింపు కార్డులతో వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అన్ని ప్రభుత్వ, ఏరియా దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 84 కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. ఆసిఫాబాద్లో 15, నిర్మల్లో 25, ఆదిలాబాద్ 14, మంచిర్యాలలో 30 కేంద్రా ల్లో టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. కరోనా వ్యాక్సినేషన్పై అపోహలు వీడాలని అధికారులు సూచిస్తున్నారు. 45 ఏండ్లు నిండిన వారు టీకా వేయించుకోవాలని, ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉందని, కరోనా లక్షణాలు ఉన్నా లేకున్నా వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనా కట్టడికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.
ప్రభుత్వాల ఆంక్షలు.. జరిమానాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయం మేరకు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. మాస్కులు ధరించని వారికి విపత్తుల నిర్వహణ చట్టం-2005 లోని 51-60 సెక్షన్లతోపాటు ఐపీసీ 188 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. మాస్కులు ధరించని వారికి రూ. వెయ్యి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. మంచిర్యాల జిల్లా జన్నారం మం డలం పొనకల్లో మంగళవారం జరిగిన వారసంతలో మాస్కులు ధరించని ముగ్గురు వ్యాపా రులకు ఒక్కొక్కరికీ రూ.వెయ్యి చొప్పున సర్పంచ్ జరిమానా విధించారు. అలాగే ఏప్రిల్ 30 వరకు ఎలాంటి వేడుకలు, ఊరేగింపులు, ర్యాలీలు, మ త పరమైన ప్రార్థనలు నిర్వహించరాదని, జనం సమూహంగా ఉండరాదని ఆంక్షలు విధించింది. పని ప్రదేశాలు, బహిరంగ స్థలాలు, ప్రజా రవా ణా సమయంలో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అధికారులు కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు. కొందరు పోలీసులు మాస్కులు అందిస్తున్నారు.