Bajrang Punia: భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా కేంద్ర ప్రభుత్వం తనకు ప్రధానం చేసిన అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’ అవార్డును వాపస్ ఇవ్వడం కలకలం రేపుతోంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల అనంతరం కుస్తీ వీరులు ఒక్కొక్కరుగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ వివాదంపై కామెంట్ చేసేందుకు నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఠాకూర్ను విలేకరులు పునియా ప్రస్తావన తీసుకురాగా.. ‘ఈ విషయంలో నేను ఇదివరకే చాలా మాట్లాడాను. నో మోర్ కామెంట్స్’ అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఇటీవలే హాంగ్జౌ (చైనా) వేదికగా ముగిసిన ఆసియా క్రీడలలో పతకాలు గెలిచిన క్రీడాకారులకు సత్కరించేందుకు గాను బెంగళూరులోని సాయ్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అతిథిగా వచ్చిన ఠాకూర్.. ‘ఆసియా క్రీడలలో మన అథ్లెట్లు వందకు పైగా పతకాలు సాధించారు. వీరికి తగిన గుర్తింపు రావాలి..’ అని చెప్పారు. గతకొన్నాళ్లుగా భారత్ క్రీడలలో మెరుగ్గా రాణిస్తుందని, ఇదే స్ఫూర్తిని భవిష్యత్లోనూ కొనసాగించాలని ఆయన తెలిపారు.
ఇదిలాఉండగా గురువారం జరిగిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలలో మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. సంజయ్ సింగ్ గెలిచిన తర్వాత సాక్షి మాలిక్ అదే రోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పునియా ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాసి మరీ తన పద్మశ్రీని వాపస్ ఇచ్చేశాడు. కాగా శుక్రవారం పునియా పద్మశ్రీ అవార్డును వెనక్కిచ్చేయడం వ్యక్తిగత అంశమని కేంద్ర క్రీడా శాఖ ప్రతినిధులు కామెంట్స్ చేసిన విషయం విదితమే. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరే అవకాశం లేకపోలేదు.