హైదరాబాద్, ఆట ప్రతినిధి: దేశంలో క్రీడలను అందరికీ చేరువచేసేందుకు స్పోర్ట్స్ ఫర్ ఆల్(ఎస్ఎఫ్ఏ) పనిచేస్తుంది. భవిష్యత్ చాంపియన్లను తీర్చిదిద్దేందుకు క్రీడా సంస్కృతిని పెంపొందిస్తున్నది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి క్రీడలను విప్లవాత్మకంగా మార్చే లక్ష్యంతో దేశంలో పాఠశాల స్థాయి నుంచి ఎస్ఎఫ్ఏ చాంపియన్షిప్లను నిర్వహిస్తున్నది. దీని ద్వారా యువతలో ఆనందకరమైన, స్ఫూర్తిదాయకమైన వాతావరణాన్ని నెలకొల్పుతున్నది.
2015లో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 ఎస్ఎఫ్ఏ టోర్నీలు నిర్వహించగా,4వేల పాఠశాలల నుంచి రెండు లక్షలకు పైగా అథ్లెట్లు పోటీపడ్డారు. ఈసారి ఐదవ ఎడిషన్ను హైదరాబాద్లో నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఏ వ్యవస్థాపకులు రిషికేశ్జోషి, విశ్వాస్ పేర్కొన్నారు. నాలుగు నెలల వ్యవధిలో 10 ఎస్ఎఫ్ఏ టోర్నీలు నిర్వహించడం ద్వారా రెండు లక్షల మంది అథ్లెట్లు పోటీపడే అవకాశం కల్పిస్తున్నామన్నారు.