Sourav Ganguly : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 2023 ఐపీఎల్లో కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ సీజన్లో అతను ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా విధులు నిర్వహించనున్నాడు. అంతేకాదు ఆ ఫ్రాంఛైజీకి సంబంధించిన ఇంటర్నేషనల్ లీగ్ (ఐఎల్టీ 20) దుబాయ్ క్యాపిటల్స్, ఎస్ఏ 20 జట్టు ప్రిటోరియా క్యాపిట్స్కు కూడా డైరెక్టర్గా వ్యవహరించనున్నాడు. అయితే ఈ విషయాన్నిఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం అధికారికంగా ధ్రువీకరించలేదు. ఢిల్లీ ఫ్రాంఛైజీతో దాదా కలిసి పనిచేయడం ఇది రెండోసారి. 2019లో ఫ్రాంఛైజీకి మెంటర్గా ఉన్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ హెడ్ కోచ్గా ఉన్నాడు. వీళ్లిద్దరూ ఐపీఎల్ తొలి సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడారు.
సచిన్ టెండూల్కర్తో కలిసి గంగూలీ భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. వీళ్ల ఓపెనింగ్ జోడీ భారత్ తరఫున అత్యధిక భాగస్వామ్యాలు నమోదు చేసింది. గంగూలీ సారథ్యంలో టీమిండియా బలమైన జట్టుగా అవతరించింది. అంతేకాదు 2003 వరల్డ్ కప్లో జట్టును ఫైనల్కు చేర్చాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత దాదా మళ్లీ ఐపీఎల్లో తన కళాత్మక షాట్లతో ఫ్యాన్స్ను అలరించాడు. ఐపీఎల్లో మొదట కోల్కతా నైట్ రైడర్స్, సహారా పూణే వారియర్స్ జట్లకు కెప్టెన్గా ఉన్నాడు. 2019లో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. పోయిన ఏడాది ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. అతని ప్లేస్లో మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ హీరో రోజర్ బిన్ని కొత్త బాస్గా బాధ్యతలు చేపట్టాడు.