కోల్కతా: బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీని రెండవ సారి కొనసాగించడం లేదు. ఆ పదవి కోసం రోజర్ బిన్నీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. గంగూలీకి అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఐసీసీ చైర్మెన్గా సౌరవ్ గంగూలీ పోటీ పడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీని అభ్యర్థించనున్నట్లు దీదీ తెలిపారు. బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి రెండవసారి ఇవ్వకపోవడం పట్ల మమతా బెనర్జీ షాక్ వ్యక్తం చేశారు.
బీసీసీఐ నుంచి గంగూలీని అక్రమ రీతిలో తప్పిస్తున్నట్లు ఆమె ఆరోపించారు. తనకు బాధగా ఉందని, సౌరవ్ పాపులర్ వ్యక్తి అని, ఇండియా జట్టుకు కెప్టెన్గా చేశారని, ఆయన దేశం కోసం ఎంతో చేశారని, బెంగాల్కే కాదు, యావత్ దేశానికి అతను గర్వకారణమని, ఎందుకు బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించారని ఆమె అడిగారు. కోల్కతా ఎయిర్పోర్ట్లో రిపోర్టర్లతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నానని, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎన్నికల్లో గంగూలీ పోటీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీని దీదీ కోరారు. ఐసీసీ చైర్మన్ పదవి కోసం అక్టోబర్ 20వ తేదీన నామినేషన్లు వేయనున్నారు.