వెల్లింగ్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఆ టీమ్ పేస్ బౌలర్ కైల్ జేమీసన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. కానీ చివరి రోజు తన టీమ్ చేజింగ్ చేస్తున్నప్పుడు ఆ టెన్షన్ తట్టుకోలేక తాను బాత్రూమ్లో దాక్కున్నట్లు అదే బౌలర్ చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లండ్ కౌంటీ టీమ్ సర్రేకు ఆడుతున్న అతడు.. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఫైనల్ మ్యాచ్ చివరి రోజు డ్రెస్సింగ్ రూమ్లో తాను పడ్డ టెన్షన్ గురించి చెప్పాడు. ఓ మ్యాచ్ చూడటానికి తాను ఇంత ఇబ్బంది పడిన సందర్భంగా బహుశా గతంలో ఎప్పుడూ లేదు. మేము డ్రెస్సింగ్ రూమ్ లోపల కూర్చొని టీవీలో మ్యాచ్ చూస్తున్నాం. ప్రతి బాల్కు ఇండియన్ ఫ్యాన్స్ అరుస్తున్నప్పుడల్లా వికెట్ పడిందా అన్న ఆందోళన నాలో కలిగింది.
కానీ తీరా చూస్తే డాట్ బాల్ లేదంటే సింగిల్ వచ్చినప్పుడల్లా వాళ్లు అరుస్తున్నారు. ఇది చాలా కష్టమైన మ్యాచ్. కొన్నిసార్లు ఆ టెన్షన్ తట్టుకోలేక నేను బాత్రూమ్లోకి వెళ్లాను. ఆ సౌండ్ వినిపించకుండా ఉండేందుకు ఇలా చేశాను అని జేమీసన్ చెప్పుకొచ్చాడు. కానీ విలియమ్సన్, టేలర్లాంటి గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ చివరికి పనిని సులువుగా ముగించారని అతడు అన్నాడు. ఈ మ్యాచ్ విజయాన్ని పెద్దగా ఆస్వాదించే అవకాశం జేమీసన్కు దక్కలేదు. మ్యాచ్ ముగిసిన 48 గంటల్లోపే అతడు కౌంటీ క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. ఐపీఎల్లో తన కెప్టెన్ అయిన విరాట్ కోహ్లిని ఫైనల్లో రెండుసార్లు ఔట్ చేయడం తనకు మరుపురాని ఫీలింగ్ అని జేమీ అన్నాడు.