నేటి నుంచి ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్
మనీలా: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్.. ఆసియా చాంపియన్షిప్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగనున్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లుగా జరగని ఈ మెగాటోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. మహిళల సింగిల్స్లో సింధు నాలుగో సీడ్గా.. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ ఐదో సీడ్గా బరిలోకి దిగనున్నారు. హెచ్ఎస్ ప్రణయ్, గాయత్రి గోపీచంద్ గాయాల కారణంగా ఈ టోర్నీకి దూరమయ్యారు. తొలి రౌండ్లో లీ షై ఫెంగ్ (చైనా)తో లక్ష్య తలపడనుండగా.. పై యూ పో (చైనీస్ తైపీ)తో సింధు అమీతుమీ తేల్చుకోనుంది. ఇటీవల స్విస్ ఓపెన్, సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్న సింధు.. కామన్వెల్త్, ఆసియా క్రీడలకు ముందు సత్తాచాటాలని చూస్తున్నది.
టోర్నీ అంచనాలకు అనుగుణంగా సాగితే క్వార్టర్స్లో సింధుకు హె బింగ్ జియావో ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ఏడో సీడ్గా ప్రయాణం ప్రారంభించనుండగా.. సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే జొనాథన్ క్రిస్టీతో తలపడనున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు మూడు పతకాలు కొల్లగొట్టిన సైనా నెహ్వాల్ గాయం నుంచి కోలుకొని ఫామ్లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. యువ షట్లర్లు ఆకర్శి కశ్యప్, మాళవిక తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ ఏడో సీడ్గా బరిలోకి దిగనుంది.
గాయాలతో సిక్కీ, గాయత్రి దూరం..
మహిళల డబుల్స్ స్పెషలిస్ట్ సిక్కిరెడ్డి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన సెలెక్షన్ ట్రయల్స్లో సిక్కి గాయపడింది. ఇక గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీ కూడా గాయం కారణంగా చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగింది. మహిళల డబుల్స్లో సీనియర్ల ప్రాతినిధ్యం లేకపోవడంతో అశ్విని భట్-శిఖా గౌతమ్, సిమ్రన్-రితిక జోడీలు బరిలోకి దిగనున్నాయి. మిక్స్డ్ డబుల్స్లో వెంకట్ గౌరవ్ ప్రసాద్-జూహి, ఇషాన్ భట్నాగర్-తనీషా జత కట్టనున్నారు.