ZIMvsIRE: జింబాబ్వే సారథి, ఆల్ రౌండర్ సికందర్ రజా ఆల్ రౌండ్ షోతో ఆ జట్టు ఉత్కంఠపోరులో ఐర్లాండ్ను ఓడించింది. జింబాబ్వే పర్యటనలో భాగంగా ఆ దేశానికి వచ్చిన ఐర్లాండ్.. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా తొలి మ్యాచ్ ఆడగా.. ఆఖరి బంతి వరకూ హోరాహోరిగా సాగిన పోరులో జింబాబ్వే ఒక్క వికెట్ తేడాతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేయగా లక్ష్యాన్ని జింబాబ్వే ఆఖరిబంతికి ఛేదించి ఉత్కంఠ విజయాన్ని సొంతం చేసుకుంది. బంతితో మూడు వికెట్లు తీసిన సికందర్.. తర్వాత బ్యాట్తో కూడా 65 పరుగులు చేశాడు.
హరారే వేదికగా జరిగిన తొలి టీ20లో టాస్ ఓడిన ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేయగా.. ఆ జట్టులో ఒక్కరు కూడా అర్థ సెంచరీ చేయలేదు. ఓపెనర్ బాల్బ్రని (32), హ్యారీ టెక్టర్ (24), డెలాని (26), టక్కర్ (21)లు మాత్రమే ఉన్నంతలో కాస్త బెటర్గా ఆడారు. రజ నాలుగు ఓవర్లు వేసి 28 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా ఎంగర్వ, ముజర్బానీలు తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం ఛేదనలో జింబాబ్వే.. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ వెస్లీ (25)తో కలిసి సికందర్ రజా (42 బంతుల్లో 65, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆ జట్టును గాడినపెట్టారు. వెస్లీ నిష్క్రమించినా వికెట్ కీపర్ గ్లైవ్ మడాండె (20)తో కలిసి రజా జింబాబ్వేను విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో రజా ఔటైనా చివరి ఓవర్లో విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా ఎంగర్వ (5), ట్రెవర్ (5 నాటౌట్)లు కూల్గా ఆడి జింబాబ్వేకు ఉత్కంఠ విజయాన్ని అందించారు. ఈ సిరీస్లో తదుపరి మ్యాచ్ ఈనెల 9న జరగాల్సి ఉంది.