MCA : భారత క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)కు మరో షాక్ తగిలింది. పేలవ ప్రదర్శనతో ఇప్పటికే జట్టులో స్థానం కోల్పోయిన అతడిని ముంబై క్రికెట్ సంఘం (MCA) కెప్టెన్సీ నుంచి తప్పించింది. రంజీ ట్రోఫీ(Ranji Trophy)కి ముందే అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించింది. శార్దూల్ స్థానంలో సిద్దేశ్ లాడ్ (Siddhesh Lad)ను సారథిగా ప్రకటించింది ఎంసీఏ. అనుభవజ్ఞుడైన ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఈసారి ముంబైని నడిపించనున్నాడు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్లు అందుబాటులో ఉన్నప్పుడు వైట్బాల్ టోర్నీల్లో ముంబైకి సారథ్యం వహిస్తారని ఎంసీఏ అధికారి ఒకరు వెల్లడించారు.
రంజీ ట్రోఫీకి ముందే ముంబై క్రికెట్ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అజింక్యా రహానే(Ajinkya Rahane) వారసుడిగా పగ్గాలు చేపట్టిన శార్ధూల్ ఠాకూర్ను తప్పిస్తూ.. మిడిలార్డర్ బ్యాటరైన సిద్ధేశ్ లాడ్కు సారథ్యం అప్పగించింది. శార్దూల్పై పనిఒత్తిడి లేకుండా చూడడం కోసం, రెడ్ బాల్ క్రికెట్లో పేసర్గా అతడి సేవలు అవసరమని భావించిన ఎంసీఏ ఈ నిర్ణయం తీసుకుంది. జులైలో రహానే అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకడంతో.. అనుభవం, జట్టును సమర్ధంగా నడిపించగల ఆటగాడి కోసం చూసిన ముంబై క్రికెట్.. సిద్దేశ్ను సారథిగా ఎంపిక చేసింది.
Either Shreyas Iyer or Suryakumar Yadav will lead the side in white-ball domestic tournaments depending on their availability
Details: https://t.co/sqNb8qqDqG pic.twitter.com/0clXcvg705
— Cricinfo (@cricinfo) September 1, 2026
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముంబై ఆటగాడిగా అరంగేట్రం(2013 నవంబర్లో) చేసిన సిద్దేశ్ గతకొంత కాలంగా దేశవాళీలో నిలకడగా రాణిస్తున్నాడు. జట్టు కష్టాల్లో పడినప్పుడు క్రీజునంటుకొని ముంబైకి ‘మిస్టర్ డిపెండబుల్’గా మారిన అతడు.. నిరుడు రంజీ సీజన్లో ఏకంగా 774 రన్స్ సాధించాడు. ఎనిమిది మ్యాచుల్లో ఐదు సెంచరీలు, ఒక అర్ధ శతకంతో అదరగొట్టాడు. 2022-23వ సీజన్లో గోవాకు మారిన అతడు.. ఏడాదికే తిరిగొచ్చాడు. దాంతో.. ఒక సంవత్సరం ముగిశాక.. 2024-25లో మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగాడు.

అజింక్యా రహానే సారథ్యంలో రంజీ ఛాంపియన్గా నిలిచిన ముంబై.. రికార్డు స్థాయిలో 43వ సారి ఈ ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు 34 ఏళ్ల సిద్ధేశ్ ఆ విజయాల వారసత్వాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నాడు. 2026వ సీజన్ అక్టోబర్ 11వ తేదీన మొదలవ్వనుంది. ఎలైట్ గ్రూప్ డీ(Elite D)లో ముంబైతో పాటు ఛండీగఢ్, హర్యానా, రాజస్థాన్, రైల్వేస్, తమిళనాడు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ జట్లు ఉన్నాయి. తమ ఆరంభ మ్యాచ్లో ఛండీగఢ్ను ముంబై ఢీకొట్టనుంది.